అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. మూడేళ్ల కాలంలో అమరావతి తొలి విడత నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అమరావతికి కేంద్ర సాయం పైన తాజాగా ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కీలక భేటీలు నిర్వహించారు. ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ సమావేశం అయ్యారు. కేంద్రం నుంచి వచ్చిన హామీతో అమరావతి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చంద్రబాబు సింగపూర్ పర్యటన వేళ ఏపీ రాజధాని విషయంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.

అమరావతి రెండో విడత భూ సమీకరణ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండటంతో రైతులకు పూర్తి సమాచారం ఇచ్చి వారిని సమీకరణకు ఒప్పించేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రైతుల్లో ఉన్న అపోహలు తొలగించాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ముందు గా 20 వేల ఎకరాల వరకు సమీకరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వచ్చే వారం నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కొందరు రెండో విడత సమీకరణ పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో.. తుది నిర్ణయం ఏమిటనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో మొదలైంది. కాగా, రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ల్యాండ్ పూలింగ్ కు ముందుకు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

ఈ మేరకు ముఖ్యమంత్రి సింగపూర్ వెళ్లే లోపే దీనిపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన సీఆర్డీఏ ఆథారిటీ సమావేశంలో తుళ్లూరు, అమరావతి మండలాల్లో ఏడు గ్రామాల్లో భూ సమీకరణకు ఆమోదం తెలిపారు.  సీఆర్డీఏ రీజియన్ పరిధిలో భూ సమీకరణ పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిలో నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలనే తేదీని ఖరారు చేయలేదు. దీంతో పూలింగు జరుగుతుందా లేదా అనే అంశంపై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈనెలాఖరులోపే పూలింగు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. ఒక్కో రెవెన్యూ గ్రామానికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ల నియామక ప్రక్రియను వేగవంతం చేశారు.

తాజాగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన సమయంలో ఆర్దిక పరమైన మద్దతు అమరావతి కోసం కేంద్రం నుంచి కోరారు. ఇందుకు సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, వీలైనంత త్వరగా సమీకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన టీంతో కలిసి సింగపూర్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అర్బన్ ప్లానింగ్, బ్యూటిఫికేషన్, గార్డెనింగ్, పోర్టులపై చర్చ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం అమరావతి ప్లానింగ్ ఆంశంపైనే సింగపూర్ ప్రభుత్వంతో రాష్ట్రం చర్చలు జరుపుతోంది. అక్కడ చర్చించే అంశాల్లో అమరావతి ప్లానింగే కీలకంగా ఉండనుంది. రాజధాని పైన కీలక చర్చలు జరిగే అవకాశం ఉండటంతో.. ఈ లోగానే ల్యాండ్ పూలింగ్ పైన నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. మొత్తానికి అమరావతి రాజధానిపై ప్రభుత్వం వేస్తున్న అడుగుల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

Related Videos