ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఆయన దుబాయ్, అబుదాబి, UAEలలో పర్యటించనున్నారు. ఇవాళ ఆయన విదేశాలకు వెళ్లనున్నారు. విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం. రియల్ ఎస్టేట్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్, రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించనున్నారు. వివిధ దేశాల నుండి పెట్టుబడిదారులను ఆకర్షించి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు సీఎం వెంట వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను వివరిస్తారు.
విశాఖపట్నంలో నవంబర్లో రెండు రోజుల పాటు భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు వివిధ దేశాల పారిశ్రామికవేత్తలను, ప్రతినిధులను ప్రభుత్వం ఆహ్వానించింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నవంబర్ 2 నుంచి 5 వరకు లండన్ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమవుతారు. ఆయన నవంబర్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు బ్రిటన్ రాజధాని లండన్లో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా లండన్ పర్యటన కొనసాగనుంది.
మరోవైపు మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్షోలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అనుభవం కలిగిన సమర్థ నాయకత్వం ఉందని తెలిపారు. విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు అందరూ రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యాపార రంగంలో వేగవంతమైన విధానాల వల్ల ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, గత 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన వెల్లడించారు. ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, విశాఖను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. మొత్తం మీద అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు ఐటీ మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలతో ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే పనిలో ఉన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos