మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి పులివెందుల సీఐ శంకరయ్యపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కేసు దర్యాప్తు సక్రమంగా చేయకపోవడం వంటి కారణాలతో ఆయన్ను సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగిస్తూ (డిస్మిస్) కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే లీగల్ నోటీసులు పంపి శంకరయ్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వివేకా హత్య జరిగినప్పుడు ఘటనాస్థలిలో సాక్ష్యాలను చెరిపివేస్తున్నా సీఐగా శంకరయ్య అడ్డుకోలేదని చంద్రబాబు పలు సందర్భాల్లో విమర్శించారు. ఈ వ్యాఖ్యలు తన పరువుకు నష్టం కలిగించాయని పేర్కొంటూ శంకరయ్య సీఎంకు నోటీసులు పంపారు. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగినప్పుడు శంకరయ్య పులివెందుల సీఐగా ఉన్నారు. హత్యాస్థలిలో రక్తపు మరకలను శుభ్రం చేస్తున్నా ఆయన వారించలేదని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేపట్టిన సీబీఐకి ఆయన మొదట కీలక వాంగ్మూలం ఇచ్చారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన అనుచరులు తనను బెదిరించారని, కేసు నమోదు చేయవద్దని ఒత్తిడి చేశారని తెలిపారు. అయితే, మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు మాత్రం నిరాకరించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే నాటి జగన్ ప్రభుత్వం ఆయనపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేయడం గమనార్హం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శంకరయ్యపై వచ్చిన ఆరోపణల విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వేకెంట్ రిజర్వ్ (వీఆర్)లో ఉన్న ఆయన, విచారణకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉన్నతాధికారులు ఆయన్ను సర్వీసు నుంచి తొలగిస్తూ తుది నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా.. ఇటీవల వివేకా హత్య కేసు విషయంలో చంద్రబాబు తనపై ఆరోపణలు చేశారని సీఎంకే నేరుగా లీగల్ నోటీసులు పంపించారు. దీంతో రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ క్రమశిక్షణ చర్యలు ప్రారంభించారు. ఈ ప్రక్రియలో అంతర్గత విచారణలు, ఆరోపణల పరిశీలన తర్వాత, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం రాత్రి డిస్మిస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్యలు వైఎస్ వివేకానంద రెడ్డి కేసు విచారణల్లో జరిగిన ఆరోపణలు, ఇతర క్రమశిక్షణ లోపాలపై ఆధారపడి ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos