ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ డ్రగ్స్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయనకు ఆదేశాలు జారీ చేశారు.ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు సూచించారు. అలాగే మహేశ్కు నోటీసులు ఇవ్వాలని కూడా ఆదేశించారు. డ్రగ్స్ కేసుల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. నేతల బలహీనతలు, తప్పిదాల వల్ల పార్టీకి నష్టం కలగకుండా చూస్తామని ఆయన తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ ప్రమేయంపై ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం సీరియస్గా దృష్టి సారించింది. ప్రధాన నిందితులతో ఆయనకు ఉన్న సంబంధాలు, డ్రగ్స్ పార్టీలు, ఇతర లావాదేవీలపై అధికారులు ఫోకస్ పెట్టారు. డ్రగ్స్ నెట్వర్క్తో ఎంపీకి ఉన్న అనుబంధాలపై లోతైన విచారణ చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు
మరోవైపు.. హైదరాబాద్ శివారు మొయినాబాద్లోని ఫామ్హౌస్లో జరిగిన పార్టీలో తాను డ్రగ్స్ తీసుకున్నట్టు వచ్చిన కథనాలను ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ తీవ్రంగా ఖండించారు. స్టేషన్ బెయిల్పై విడుదలైన కొద్ది గంటలకే ఆయన ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం స్నేహితులతో కలిసి డిన్నర్ కోసమే అక్కడికి వెళ్లానని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, తనపై నియోజకవర్గ ప్రజలు, పార్టీ ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని పుట్టా మహేష్ అన్నారు. మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని, త్వరలోనే అన్ని వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతానని తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos