ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు సభ్యులు సరిగా హాజరు కాకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు ఎమ్మెల్యేల గైర్హాజరు, వచ్చినా మధ్యలోనే వెళ్లిపోతున్న తీరుపై ఆయన తీవ్ర అసహనం ప్రదర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభలో సభ్యుల బాధ్యతారాహిత్యాన్ని సహించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే.. ఇవాళ శాసనసభ సమావేశం ప్రారంభమయ్యే సమయానికి సభలో కేవలం 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, వెంటనే చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును పిలిచి సభ్యుల గైర్హాజరుపై ఆరా తీశారు. సభకు రాని ఎమ్మెల్యేలకు తక్షణమే ఫోన్లు చేసి పిలిపించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో విప్లు రంగంలోకి దిగి ఫోన్లు చేయడంతో, 17 మంది సభ్యులు హుటాహుటిన సభకు చేరుకున్నారు. అయితే, అలా వచ్చిన వారిలో కూడా కొందరు సభ్యులు కీలక చర్చలు జరుగుతుండగానే సభ నుంచి నిష్క్రమించడం ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని మరింత పెంచింది. "ఈ విధంగా ఉంటే సమావేశాలు ఎలా జరుగుతాయని.. ప్రజలు మనపై ఎంతో నమ్మకంతో గెలిపించారు, వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదని" చంద్రబాబు సభ్యులను ఉద్దేశించి అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేలు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సీఎం కఠినంగా వ్యవహరిస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos