ఏపీలో కేంద్రం సహకారంతో జాతీయ రహదారుల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల జాతీయ రహదారుల విస్తరణ పనులతో పాటు, కొత్త రోడ్డు మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నేషనల్ హైవే 16, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ వంటి నగరాల మీదుగా చెన్నై- కోల్ కత్తా తీరం హైవే, నేషనల్ హైవే 716, కడప, రేణిగుంట, తిరుపతి ప్రాంతాలలో నాలుగు లైన్లుగా విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. నేషనల్ హైవే 71, నేషనల్ హైవే 167 ఏ, నేషనల్ హైవే 67 ఇలా అనేక రహదారుల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా బెంగళూరు - కడప - విజయవాడ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఎన్ హెచ్ 544జి పైన కీలక ప్రకటన వచ్చింది. ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు 61.72శాతం పనులు పూర్తయ్యాయి. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 28నాటికి హైవే పనులను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఈ హైవేకి సంబంధించి భూసేకరణ వివాదం హైకోర్టులో ఉండడంతో పనులు నత్తనడకన సాగగా, ఇటీవల పరిష్కారం కావడంతో పనులలో వేగం పుంజుకుంది. ఈ రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే బెంగళూరుకు కేవలం ఎనిమిది గంటల్లోనే చేరుకోవచ్చని అంచనా. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ను సంవత్సరంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో వెల్లడించారు.
ఈ రహదారి వెంట ఏర్పాటు చేసే ఇంటర్ చేంజ్ లు, రెస్ట్ ఏరియాల పనులు కూడా జరుగుతున్నట్లుగా సీఎం తెలిపారు. బెంగళూరు నుంచి విజయవాడ వరకు ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి నిర్మిస్తున్న ఈ జాతీయ రహదారితో ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. కడప జిల్లాలో ఎన్ హెచ్ 67 నాలుగు లైన్లుగా విస్తరించే పనులు ముగింపు దశలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ హైవే మధ్యలో 4.75 కిలోమీటర్ల భాగం అటవీ ప్రాంతం ఉండడంతో కాంట్రాక్టర్ ఆ భాగాన్ని డీ స్కోప్ చేశారు. ఈ ప్రాంతంలో కొత్త టెండర్లను పిలవాలని, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. కడప జిల్లా నుండి తిరుపతి జిల్లాకు సంబంధించిన హైవే పనులు వేగవంతమైనప్పటికీ ఓబులవారిపల్లె మండలంలోని ఓరంపాడు ప్రాంతంలో అటవీ అనుమతులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ అనుమతులు కూడా త్వరగా వస్తే వేగంగా ఈ రహదారిని విస్తరించే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos