పవిత్ర రంజాన్ మాసం వేళ రాష్ట్రంలోని ముస్లిం మత పెద్దలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇమామ్లు, మౌజన్ల సంక్షేమం పట్ల తనకున్న నిబద్ధతను చాటుకుంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నిధులను విడుదల చేశారు. గత ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాల బకాయిలను ఒకేసారి చెల్లిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే, హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే స్పందించిన సీఎం, సుమారు రూ.45 కోట్ల నిధులను విడుదల చేశారు. పండుగ పూట వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా ఈ నిర్ణయం తీసుకోవడంపై ముస్లిం మైనారిటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 10,000 మంది ఇమామ్లు, మౌజన్ల బ్యాంకు ఖాతాల్లోకి ఈ నిధులు నేరుగా జమ కానున్నాయి. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా లబ్ధి చేకూరనుంది. సుమారు 5,000 మంది ఇమామ్లకు ఆరు నెలల గౌరవ వేతనం కింద రూ.30 కోట్లు చెల్లించారు. అదేవిధంగా మరో 5,000 మంది మౌజన్లకు ఆరు నెలల బకాయిల కింద రూ.15 కోట్లు విడుదల చేశారు.
గత ఆరు నెలలుగా నిలిచిపోయిన వేతనాలు రంజాన్ పండుగ ముందే ఒకేసారి అందనుండటంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అటు ఇఫ్తార్ విందులు, ఇటు ఆర్థిక తోడ్పాటుతో కూటమి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ముస్లిం పెద్దలు కొనియాడుతున్నారు. అర్హత కలిగిన ఇమామ్లను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వివాహ లైసెన్స్ గడువు 3 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచామని తెలిపారు. 347 మంది ముస్లింలు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్రకు వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 33,275 మందికి ఆర్ధిక చేయూత కింద రూ.193 కోట్లు ఇచ్చాం. యువతకు నైపుణ్యాలు అందించి మెరుగైన ఉపాధి ఉద్యోగాలు దక్కేలా చేస్తున్నాం. గత పాలకులు జీవో 47 ద్వారా వక్ఫ్ బోర్డును వివాదాల్లోకి నెట్టారు. ఆ జీవోను రద్దు చేసి వక్ఫ్ బోర్డును పునర్వవ్యస్తీకరణ చేశాం. 1500 వక్ఫ్ ఆస్తులను సర్వే చేశాం. వక్ఫ్ ఆస్తులను కాపాడుతున్నాం. నూర్ బాషా ఫెడరేషన్ పేరును దూదేకుల ముస్లిం ఫైనాన్స్ కార్పోరేషనుగా మార్పు చేసి రూ.100 కోట్లు కేటాయించామని సీఎం చంద్రబాబు అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos