ఏపీలోని కూటమి ప్రభుత్వం.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై దృష్టి సారించింది. రాష్ట్రానికి జీవనాడిగా భావించే ఈ ప్రాజెక్ట్ను శరవేగంగా పూర్తి చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు ఉంటారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిపై అక్కడికక్కడే సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటివరకు జరిగిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటారు. ఉదయం 10 గంటలకు చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి హెలీకాఫ్టర్లో పోలవరానికి బయలుదేరి వెళ్తారు. 10: 45 నిమిషాలకు ప్రాజెక్టుకు చేరుకుంటారు. అనంతరం హిల్ వ్యూ పాయింట్ నుంచి నిర్మాణ పనులను వీక్షిస్తారు. ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు డయాఫ్రమ్ వాల్, అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్, గ్యాప్ 1, గ్యాప్ 2, వైబ్రో కంప్రెషన్ తదితర పనులను పరిశీలిస్తారు. అనంతరం 3 గంటల వరకు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. 3:10 నిమిషాలకు తిరుగు ప్రయాణమవుతారు. మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కేపీఎస్ కిశోర్ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రే హౌండ్స్ బలగాలు, యాంటీ నక్సల్స్ స్వాడ్ దళాలను మోహరింపజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos