ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు డిసెంబర్ 1న ఏలూరు జిల్లాలో ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఉదయం 10.30 నిమిషాలకు ఉండవల్లిలోని తన నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉంగుటూరు మండలం గొల్లగూడెం చేరుకున్నారు. అక్కడ ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం గొల్లగూడెం నుంచి బయలుదేరి ఉంగుటూరు మండలం గోపినాథపట్నానికి చేరుకుంటారు.
గోపినాథపట్నంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సీఎం చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. ఆయా కుటుంబాలతో నేరుగా మాట్లాడి .. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. గోపినాథపట్నం నుంచి బయలుదేరి వెళ్లి.. నల్లమాడలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు నల్లమాడ నుంచి బయలుదేరి గొల్లగూడెం చేరుకుని అక్కడ.. స్థానిక పార్టీ క్యాడర్ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3. 35 గంటలకి హెలికాప్టర్లో ఉండవల్లికి తిరుగు పయనం అవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత.. ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి నెల మొదటి రోజు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని కుటుంబాలకు సీఎం చంద్రబాబు స్వయంగా పరామర్శించి.. పింఛన్ అందజేస్తున్న సంగతి తెలిసిందే.
మరోవైపు డిసెంబర్లో కొత్తగా 8,190 పింఛన్లు ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ సోమవారం ఉదయం నుంచి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ పింఛన్ల కోసం ప్రభుత్వం రూ. 2738. 71 కోట్లను విడుదల చేసింది. మరోవైపు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ శిబిరాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 144 మందికి శిక్షణ ఇవ్వనున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos