ఏపీలో ఈరోజు ఉదయం నుంచి శరవేగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం కూటమి ప్రభుత్వం రూ. 2,717 కోట్లు విడుదల చేసింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో ప్రభుత్వం 31వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. జనవరి 1వ తేదీకి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒక రోజు ముందుగానే పంపిణీ కార్యక్రమం చేపట్టింది సర్కార్. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు 83.45 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తి అయినట్లు తెలుస్తోంది.
ఉదయం 10 గంటల సమయానికే 53,22,406 మందికి రూ. 2,256 కోట్లు పంపిణీ చేశారు. లబ్దిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేసి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇళ్ల వద్దే పింఛన్లు ఇస్తున్నారా? లేదా? అనే విషయాన్ని జియో ట్యాగింగ్ ద్వారా అధికారులు తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో జియో ట్యాగింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ చేశారు. 2021లో కరోనాతో భర్తను కోల్పోయిన తలారి శారమ్మకు వితంతు పింఛన్, ఏడు కొండలకు వృద్ధాప్య పింఛన్ స్వయంగా అందించారు. వారి ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
పింఛన్ల పంపిణీ తర్వాత గ్రామంలోని కోదండరామస్వామిని దర్శించుకోనున్న చంద్రబాబు అనంతరం గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం కోటప్పకొండ వెళ్లి కోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరిగి గుంటూరు జిల్లా ఉండవల్లి చేరుకుంటారు. సీఎం పర్యటనకు అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. నాలుగోసారి సీఎం అయ్యాక తొలిసారి పల్నాడు జిల్లాకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos