ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది నాటికి పోలవరం పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పోలవరం వద్ద పర్యటించనున్నారు. ఈ నెల 27న అంటే గురువారం నాడు పోలవరం వెళ్లి అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులతో అక్కడే సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం పోలవరంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టర్మ్ పూర్తయ్యే లోపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక తీరానికి చేర్చాలని చంద్రబాబు ప్రభుత్వం పట్టుదలగా పని చేస్తుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పదే పదే చెబుతున్నారు.
రెండోసారి అధికారం లోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలుమార్లు పోలవరం వద్ద పర్యటించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని దగ్గర నుంచి మరోసారి పరిశీలించనున్నట్టు ఏపీ సీఎంవో చెబుతోంది. గురువారం నాడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలవరంలో చంద్రబాబు టూరు జరగనుంది. మరోవైపు ఇటీవల పార్లమెంట్ లో పోలవరం నిర్మాణాన్ని వచ్చే ఏడాది కల్లా పూర్తి చేస్తామని కేంద్ర జల శక్తి మంత్రి సీ ఆర్ పాటిల్ స్పష్టం చేశారు. గతంలో చాలా ప్రభుత్వాలు మారినా పోలవరం ప్రాజెక్టుకు ఏమీ చేయలేదని కానీ ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ఇంతవరకు పోలవరం కోసం 15 వేల కోట్లు కేటాయించారని ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్ర జలశక్తి మంత్రి స్పష్టం చేసారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 12 వేల కోట్లు కేటాయించారని నెక్స్ట్ ఇయర్ కల్లా పోలవరం నిర్మాణాన్ని ఓ దరికి చేరుస్తామని లోక్ సభ లో ప్రస్తావించారు.
పోలవరం పూర్తయితే సుమారు మూడు లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని 28 లక్షల మందికి పైగా ప్రత్యక్ష లబ్ధి చేకూరుతుందని అదనంగా మరో 540 గ్రామాలకు శాశ్వతంగా తాగునీరు లభిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇక పోలవరం ఏపీకి జీవనాడి లాంటిదని ఎప్పటినుంచో చెప్పుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ పై పట్టు చిక్కిన నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ నిధులను సాధించి పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు గురువారం చేపట్టిన పోలవరం టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos