చిలకలూరిపేట :- పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్లలోని అంగన్వాడీ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సందర్శించారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర, అన్నదాత సుఖీభవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు లింగంగుంట్ల గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి తొలుత అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. నెట్ జీరో విధానంలో భాగంగా రూ.32 కోట్లతో రాష్ట్రంలోని 44,346 అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్లు, పాత్రలను అందజేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి లింగంగుట్ల అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్, స్టీల్ పాత్రలను అందించారు. అనంతరం అంగన్వాడీ విదేశీ సరుకుల నిల్వ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
చిన్నారులతో కలిసి జావ తీసుకున్న సీఎం
అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందుగా టీచర్, సహాయకురాలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రం ద్వారా చిన్నారులకు పోషకాహారం, ప్రాథమిక విద్య, గర్భిణులు, బాలింతలకు అందజేస్తున్న సేవల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇండక్షన్ స్టవ్ను అందుకున్న అంగన్వాడీ సహాయకురాలు సీఎం సమక్షంలోనే రాగి జావను కాచారు. చిన్నారులతో మమేకమైన సీఎం...వారితో కలిసి కింద కూర్చునే రాగి జావను తీసుకున్నారు. కాసేపు వారితో ముచ్చటించారు. పచ్చదనం పెంపులో భాగంగా అంగన్వాడీ ప్రాంగణంలో అంగన్వాడీ సిబ్బందితో కలిసి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా, అధికారులు ఉన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos