“కార్యాలయాల్లో కూర్చుని కాగితాలు చూస్తే అంతా సవ్యంగానే కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయి వాస్తవాలు వేరుగా ఉంటాయి. అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి, క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను గ్రహించాలి,” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలంటే క్షేత్రస్థాయి అనుభవమే కీలకమని ఆయన నొక్కి చెప్పారు. సచివాలయంలోని ఐదో బ్లాకులో సోమవారం ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సదస్సు తొలి రోజు సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా నియమితులైన కలెక్టర్లకు రాష్ట్ర ప్రజలు, మంత్రివర్గం తరఫున శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ పాలనలో ప్రధాని, ముఖ్యమంత్రి తర్వాత జిల్లా స్థాయిలో కలెక్టర్లే అత్యంత కీలకమైన వ్యక్తులని చంద్రబాబు అభివర్ణించారు. “ఒక జిల్లా రూపురేఖలను మార్చే ప్రధాన బాధ్యత కలెక్టర్లదే. ప్రభుత్వం రూపొందించిన విధానాలను క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేయాల్సింది మీరే. అందుకే సరైన వ్యక్తి సరైన చోట ఉండాలనే లక్ష్యంతోనే సీఎస్, డీజీపీల నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు నియామకాలు చేపట్టాం. ఎమ్మెల్యేల ఎంపిక, మంత్రివర్గ కూర్పులో ఎలాంటి నిశిత పరిశీలన చేశామో, అదే తరహాలో సమర్థులైన వారిని కలెక్టర్లుగా నియమించాం. మీరంతా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని,” ఆయన ఆకాంక్షించారు.
అధికారులకు తన సంపూర్ణ మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇస్తూనే, పనితీరు విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. “పనితీరు చక్కగా ఉన్న అధికారులను నేను ఎప్పుడూ మార్చలేదు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు రిజర్వ్ బ్యాంక్ వంటి ఉన్నత సంస్థలకు వెళ్లారు. మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది. కానీ, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడను. ప్రభుత్వం అందించే ప్రతి సేవలోనూ ప్రజల సంతృప్తే మనకు కొలమానం కావాలి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని” ఆయన హెచ్చరించారు. ఈ కలెక్టర్ల సదస్సు రాష్ట్ర పాలనలో ఒక కొత్త ఒరవడిని సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు.
ఎన్డీఏ కూటమిపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, అధికారులపై ఉందని చంద్రబాబు గుర్తుచేశారు. “సంపద సృష్టించి, ఆదాయం పెంచి, ఆ ఫలాలను సంక్షేమం ద్వారా ప్రజలకు పంచుతామని చెప్పాం. ఆ మాటను ప్రజలు విశ్వసించే.. మాకు 94 శాతం స్ట్రైక్ రేట్తో అఖండ విజయాన్ని అందించారు. చెప్పినట్టుగానే సూపర్ సిక్స్ను విజయవంతంగా అమలు చేస్తున్నామని” తెలిపారు. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమమైన పెన్షన్ల పథకం ద్వారా 64 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తున్నామని, ‘తల్లికి వందనం’తో ప్రతి విద్యార్థికీ ఆర్థిక చేయూత అందిస్తున్నామని వివరించారు. ‘స్త్రీశక్తి’ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని విమర్శించిన వారికి దాని విజయమే సమాధానం చెప్పిందన్నారు. ఈ పథకం వల్ల ఆర్టీసీలో ఆక్యుపెన్సీ 90 శాతానికి పెరిగిందని, ఇందుకు కృషి చేసిన ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు.
గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, వారసత్వ ఆస్తులను సైతం కబ్జా చేసే దుస్థితి తలెత్తిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. భూ వివాదాలకు ఆస్కారం లేకుండా, రిజిస్ట్రేషన్ పత్రాలను ట్యాంపర్ చేయకుండా పటిష్ఠమైన వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. జీఎస్టీ రెండో దశ సంస్కరణల ఫలాలు ప్రజలందరికీ చేరేలా నెల రోజుల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos