మిర్చి ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక, పాలక, ప్రతిపక్ష నేతల ఎంట్రీతో.. మిర్చి ధరలకు రాజకీయరంగు పులిమినట్టు అయ్యింది. ఇప్పటికే మిర్చి రైతుల దుస్థితిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ శనివారం మిర్చి యార్డ్ అధికారులతో, ట్రేడర్స్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మిర్చి ధరల పతనంతో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం.
ఐదు లక్షల ఎకరాల్లో ఈ ఏడాది మిర్చి సాగైనట్టు అంచనాలు ఉండగా 12 లక్షల మెట్రిక్ టన్నుల్లో ఇప్పటికే నాలుగు లక్షల మెట్రిక్ టన్నులను వ్యాపార వర్గాలు కొనుగోలు చేశాయి. ఇక, మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఎప్పుడూ లేనంతగా రేట్లు పడిపోవడం... దీనిపై రాజకీయంగా విమర్శలు రైతుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న తరుణంలో రంగంలోకి దిగింది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలోనే నేడు వ్యాపారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులతో మాట్లాడి ధరల పతనానికి కారణాలను తెలుసుకోనుంది సర్కార్.
మరోవైపు మిర్చి రైతులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన రైతులని ఆదుకోవాలని కేంద్ర మంత్రిని కలిసి చెప్పారు. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్రమంత్రి దృష్టికి తెచ్చామని అన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25 శాతం మాత్రమే ఇస్తారు. అది కూడా ఐసీఏఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఏపీలోని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా ధర నిర్ణయిస్తున్నారు. సాగు ఖర్చులను రియలిస్టిక్ గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలి. అవన్నీ సరిచేయాలని కేంద్రమంత్రిని కోరినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అంటే "వ్యవసాయ ఉత్పత్తుల ధరలు బాగా పడిపోయినప్పుడు, రాష్ట్రాలు సాయం కోరితే మద్దతు ధర పథకాల పరిధిలోకి రాని వ్యవసాయ ఉత్పత్తులను కేంద్రం సేకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆ నష్టాలను భరిస్తుంది" అని సీఎం చెప్పారు. కేంద్రం ఎంఎస్పీ (గిట్టుబాటు ధర) ప్రకటించే వాణిజ్యపంటల జాబితాలో మిర్చి చేర్చకపోవడం వల్ల ఈ ఎంఐఎస్తో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎగుమతులు కేంద్రం చేతిలోనే ఉంటాయి కాబట్టి..ఎగుమతి విధానంపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos