ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా విశాఖ రుషికొండ ప్యాలెస్ సముదాయంలో పర్యటించారు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ నిర్మించిన భవనాలను చంద్రబాబు నేడు పరిశీలించారు. ఈ మధ్యాహ్నం అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో రోడ్డుపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు… అనంతరం విశాఖలోని రుషికొండ చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు వెంట మంత్రి కందుల దుర్గేశ్, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. రుషికొండ ప్యాలెస్ వివరాలను గంటా… సీఎం చంద్రబాబుకు వివరించారు. చంద్రబాబు అధికారులను అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకున్నారు. పలు భవనాల లోపలికి కూడా వెళ్లిన చంద్రబాబు… అక్కడి విలాసవంతమైన సౌకర్యాలను పరిశీలించారు. కాగా, భవనాల నిర్వహణ ఖర్చు, విద్యుత్ బిల్లుల భారం ఎక్కువగా ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రుషికొండ భవనాలను ఎలా వినియోగించాలన్న దానిపై చర్చించాల్సి ఉందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా .. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో చంద్రబాబు ఈ మధ్యాహ్నం గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు రోలర్ నడపడం విశేషం. నిన్న శ్రీకాకుళం జిల్లాలో ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తూ, ఓ ఇంట్లో సిలిండర్ డెలివరీ ఇచ్చి, స్వయంగా టీ తయారుచేసిన చంద్రబాబు… ఇవాళ మరింత ఆశ్చర్యానికి గురిచేస్తూ రోడ్డు రోలర్ డ్రైవర్ అవతారమెత్తారు. కొద్దిదూరం పాటు రోడ్డు రోలర్ నడిపి రోడ్డును చదును చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట రోడ్డు రోలర్ పై హోంమంత్రి అనిత కూడా ఉన్నారు. చంద్రబాబు తనదైన శైలిలో అందరికీ విక్టరీ సింబల్ తో అభివాదం చేస్తూ, రోడ్డు రోలర్ నడుపుకుంటూ ముందుకు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos