ఏపీలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో షాక్ తగిలింది. రాజకీయాల్ని, పదవుల్ని వదిలేసి వ్యవసాయం చేసుకుంటున్న ఆయన.. తాజాగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఓ కేసు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన సమయంలో చేసిన వ్యాఖ్యల్ని ఆధారంగా చేసుకుని ఇవాళ పోలీసులు నోటీసులు పంపారు. విజయవాడ సీపీ కార్యాలయంలో ఈ నెల 18న విచారణకు రావాలని ఆయనకు పంపిన సమన్లలో పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగినట్లు కూటమి పార్టీలు ఆరోపిస్తున్న క్రమంలో .. రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ హయాంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డిని కీలక పాత్రధారిగా గుర్తించారు. విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఆయనకు పలుమార్లు నోటీసులు పంపినా రాకపోవడంతో నిన్న హైదరాబాద్ లోని ఆయన ఇంటిలో, వ్యాపార సంస్థల్లో తనిఖీలు కూడా చేసింది.
గతంలో నమోదైన మరో కేసు విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీలో జరిగిన మద్యం కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డేనని, ఆయన గురించి భవిష్యత్తులో అడిగితే మరిన్ని వివరాలు అందిస్తానని ప్రకటించారు. దీంతో సిట్ ఇవాళ ఆయనకు నోటీసులు పంపింది. ఈ నెల 18న విజయవాడ సీపీ ఆఫీసులో జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. దీంతో విజయసాయిరెడ్డి విచారణకు హాజరై చెప్పే విషయాలు ఇప్పుడు మద్యం కుంభకోణం విచారణలో కీలకంగా మారబోతున్నాయి. ఆ తరువాత ఎలాంటి కీలక పరిణామాలు జరుగుతాయన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos