ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఫిబ్రవరి 23న అంటే రేపు ఆదివారం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను నిర్వహించేందుకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షల్లో రోస్టర్ విధానంలో నెలకొన్న లోపాలను సరిచేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు రోస్టర్ పాయింట్ విధానాన్ని సవరించాలని కోరుతూ ఆందోళనలు చేస్తున్నారు. హైదరాబాద్లో సైతం ఏపీ గ్రూప్ 2 అభ్యర్థులు నిరసనలకు దిగుతున్నారు. 2023 డిసెంబర్ 11న జారీ చేసిన నోటిఫికేషన్ రోస్టర్ లోపాలు ఉన్నాయని.. జార్ఖండ్లో జరిగినట్లుగా నియామక ప్రక్రియ చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కోవలసి రావచ్చని, ఇది నోటిఫికేషన్ రద్దుకు దారితీయవచ్చు అని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలపై ఏపీ ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
రోస్టర్ పాయింట్ విధానాన్ని సవరించకపోతే ఇది భవిష్యత్తులో తమ ఉద్యోగ అవకాశాలను ప్రభావితం చేస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. గ్రూప్-2 మెయిన్స్లోని రోస్టర్ విధానంలో లోపాలు ఉన్నాయని, వీటిని సరిచేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీపీఎస్సీ వెంటనే స్పందించాలని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా స్పందించి పరీక్షను నిర్వహించే ముందు రోస్టర్ విధానాన్ని సరిదిద్దాలని గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థుల ఆందోళనలపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనలను తాను అర్థం చేసుకున్నానని.. సమస్య పరిష్కారం కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తున్నానని తెలిపారు. ‘‘గ్రూప్ 2 అభ్యర్థుల నుంచి పరీక్షలను వాయిదా వేయమని నాకు చాలా అభ్యర్థనలు వచ్చాయి. వారి ఆందోళనలను నేను అర్థం చేసుకున్నాను. మా న్యాయ బృందాలతో సంప్రదించి, పరిష్కారాన్ని కనుగొనడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తాము’’ అని నారా లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మెయిన్స్ పరీక్ష రేపే జరగనుండటంతో ఈలోగా మంత్రి నారా లోకేష్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos