వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక మార్పు చోటు చేసుకుంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు తన సొంత నియోజకవర్గం సత్తెనపల్లిని వీడారు. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జీగా నియమితులు అయ్యారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ఓ ప్రకటన జారీ చేసింది. 2014 నుంచి వరుసగా మూడుసార్లు సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన అంబటి.. ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు. 2019లో 20 వేలకు పైగా మెజారిటీతో కోడెల శివప్రసాద రావును మట్టికరిపించారు. అంతకుముందు 2014లో కోడెల, 2024లో కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి చవి చూశారు.
ఆ తరువాత సత్తెనపల్లి నియోజకవర్గంలో మార్పులు చేపట్టింది వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. సత్తెనపల్లి ఇన్ ఛార్జీ బాధ్యతలను రెడ్డి సామాజిక వర్గానికి అప్పగించింది. గజ్జల సుధీర్ భార్గవ రెడ్డికి కోఆర్డినేటర్ గా అపాయింట్ చేసింది. దీనితో అంబటి రాంబాబు ఈ నియోజకవర్గాన్ని వీడటం ఖాయమైంది. ఇప్పుడు తాజాగా ఆయనకు గుంటూరు వెస్ట్ బాధ్యతలను అప్పగించింది పార్టీ. 2009లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గం.. తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కన్నా లక్ష్మీనారాయణ ఘన విజయం సాధించారు. ఆ తరువాత టీడీపీ జెండా పాతింది. 2014లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, 2019లో మద్దాలి గిరిధర్.. ఇక్కడ విజయదుందుభి మోగించారు. గత ఏడాది 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి ఘన విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి విడదల రజినిని 51 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. టీడీపీ బలంగా ఉన్న గుంటూరు వెస్ట్ లో అంబటి రాంబాబు ఎలా నెగ్గుకొస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos