భవిష్యత్తు నగరంగా రూపుదిద్దుకుంటున్న రాజధాని అమరావతికి ఓఆర్ఆర్ ఎంతో కీలకం కానుంది. ఔటర్ రింగురోడ్డు పూర్తయితే సీఆర్డీఏ పరిధిలోని జిల్లాల్లో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. 189.4 కిలోమీటర్ల దూరంతో నిర్మితమయ్యే ఈ ప్రాజెక్టుకు భూసేకరణ సహా అన్ని ఖర్చులూ కేంద్రమే భరించనుంది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ - మోర్త్ ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఇటీవల దీనికి ఆమోదం తెలిపింది.
డిసెంబర్ 20న మోర్త్ ఎలైన్మెంట్ అప్రూవల్ కమిటీ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. అయితే విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణం అవసరం లేదని కమిటీ తేల్చిసినట్లు తెలుస్తోంది. ఓఆర్ఆర్కు సమీపంలోనే తూర్పు బైపాస్ వెళ్తుండటంతో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని, కాకపోతే ఓఆర్ఆర్లో నాలుగుచోట్ల స్వల్ప మార్పులు చేయాలని కమిటీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ. 16,310 కోట్ల వ్యయం అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ ఓఆర్ఆర్ నిర్మాణానికి సంబంధించి సిమెంట్, స్టీల్ వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ మినహాయింపు.. కంకర, గ్రావెల్ వంటి తరలింపు కోసం సీనరేజ్ ఫీజు మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది.. దీంతో వ్యయం రూ. 1,156 కోట్ల మేర తగ్గుతుందని చెబుతున్నారు. అప్పుడు మొత్తం వ్యయం రూ. 15,154 కోట్లకు చేరింది.
భవిష్యత్తులో ఓఆర్ఆర్ వెంబడి రైల్వేలైన్ నిర్మాణం, తదితరాలకు భూమి అవసరమని ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ జాతీయ రహదారుల చట్టం-1956 ప్రకారం భూసేకరణ చేయనున్నందున, ఆ భూమిని అందుకోసమే వినియోగించాల్సి ఉంటుంది. ఇతర అవసరాలకు ఆ భూమిని వినియోగించకూడదని కమిటీ పేర్కొంది. రాష్ట్రప్రభుత్వం రైల్వేశాఖతో సంప్రదించి అదనపు భూసేకరణపై సూచనలు చేసింది. ఈ అమరావతి ఓఆర్ఆర్ ఎలైన్మెంట్కు సంబంధించి.. 500 మీటర్ల పరిధిలో భూ వినియోగ మార్పిడి, భూముల క్రయవిక్రయాలను ఆపాలని కమిటీ రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. లేనిపక్షంలో భూసేకరణ వ్యయం పెరిగిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అలాగే సర్వీస్ రోడ్లపైనా కీలక సూచనలు చేసింది.
189 కిలోమీటర్ల రింగురోడ్డును మొత్తం 11 ప్యాకేజీలుగా విభజించి మూడు దశల్లో నిర్మించనున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 22 మండలాల పరిధిలోని 87 గ్రామాల మీదుగా నిర్మాణం సాగనుంది. ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే కొన్నేళ్లలోనే విజయవాడ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు కలసి మెగా సిటీలుగా మారతాయి. అమరావతి ఓఆర్ఆర్ వీలైనంత త్వరగా పూర్తయితే రాష్ట్రానికే మణిహారంలా మారుతుందని ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos