ఇరాన్- ఇజ్రాయెల్ వార్, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా మన దేశంలోనూ డిమాండ్‌కు తగినట్లు కమర్షియల్ గ్యాస్ దొరకని పరిస్థితి. దీంతో చాలా రాష్ట్రాల్లో హోటళ్లు మూసేశారు. ఇక ప్రజలు సాధారణంగా వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలోనూ ఆందోళన నెలకొంది. సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతున్నా.. ప్రజలు మాత్రం వంట గ్యాస్ దొరుకుతుందో లేదోనని భయాందోళనలకు గురవుతున్నారు. ముందస్తు బుకింగ్‌లు చేస్తున్నారు. ఏపీలోనూ వంట గ్యాస్‌ సరఫరా విషయంలో ప్రజలు ఆందోళనకు గురువుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు.

ప్రస్తుతం ఏపీలో గ్యాస్‌ సరఫరా పరిస్థితిపై పలువురు మంత్రులతో సీఎం చంద్రబాబు ఇవాళ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితిపై మంత్రి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. గ్యాస్‌ సరఫరా అంశంపై మంత్రుల సబ్‌కమిటీ ఏర్పాటు కాగా.. ఈ కమిటీ నేడు సమావేశం కానున్నట్లు ఆయన సీఎం చంద్రబాబుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా అవసరమైన చర్యలను పూర్తిస్థాయిలో తీసుకోవాలని సీఎం మంత్రులకు సూచించారు. గ్యాస్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.

అదేవిధంగా హోటళ్లు సహా సంబంధిత భాగస్వామ్య వర్గాలతో చర్చలు జరిపాలని.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇక ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపుపై వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఆయిల్ కంపెనీల నుంచి అందిన సమాచారం మేరకు డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై అదనంగా రూ.60లు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై అదనంగా రూ.115లు పెంచినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నందున గ్యాస్ వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. అవసరానికి మించి అదనపు బుకింగ్స్ చేయకుండా వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

Related Videos