ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై, విజయవాడ జిల్లా జైలులో 220 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు... అమరావతి ప్రాంతంలో ఉన్న మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో చికిత్స చేయించుకునేందుకు ఏసీబీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఆరోగ్య పరంగా మంతెన ఆశ్రమంలో ఆయుర్వేద చికిత్స అవసరమని పేర్కొంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఆయన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. కానీ అలుపెరుగని ప్రయత్నం చేసిన ఆయన ఈ సారి అనుమతి తెచ్చుకున్నారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జడ్జి... 15 రోజుల పాటు ఆశ్రమంలో చికిత్స పొందేందుకు అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆశ్రమంలో వైద్య సేవలు పొందేందుకు కోర్టు అనుమతించింది. గతంలో వెన్నునొప్పి సమస్యతో మంతెన ఆశ్రమంలో చికిత్స తీసుకోవడంతో ఉపశమనం లభించిందని, ప్రస్తుతం కూడా అదే సమస్య తీవ్రంగా ఉందని కోర్టుకు తెలియజేయడంతో... మంతెన ఆశ్రమంలో చికిత్స పొందేందుకు కోర్టు అనుమతించింది.
చెవిరెడ్డి తన ఆరోగ్య సమస్యను చూపిస్తూ పదే పదే కోర్టును ఆశ్రయించడం వెనుక కేవలం అనారోగ్యమే కాకుండా, రాజకీయ వ్యూహం కూడా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జైలు వాతావరణం నుంచి బయటపడటానికి, బయట ఆశ్రమంలో ఉంటే తన వ్యవహారాలు చక్కబెట్టడానికి అవసరమైన పరిస్థితులు ఉంటాయన్న కారణంగానే ఆయన ఈ ప్రయత్నం చేసినట్లుగా భావిస్తున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos