Desk : మరో తుఫాను దూసుకొస్తోంది. ఏపీ పైన ప్రభావం కనిపిస్తుండటంతో... ఈ నెల 30 తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని... దీనివల్ల నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈసారి ఈ తుఫానును ఫెంగల్ తుఫానుగా పిలుస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుఫాన్ గా మారుతుంది. శ్రీలంక తీరాన్ని అనుకొని తమిళనాడు వైపు పయనిస్తున్నది. దీంతో, ఐఎండీ తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లిడించింది. ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల పైన తుఫాను ప్రభావం ఉంటుందని పేర్కొంది.
ప్రస్తుతం వాయుగుండం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు గుర్తించారు. వాయు గుండం తుఫానుగా మారుతుంటంతో ఏపీలోని పలు జిల్లాల పైన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని హెచ్చరించింది. చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 550 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైలో 29 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 30 వరకు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టుతో సహా పలు జిల్లాలలో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తుఫాను ప్రభావంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఎలాంటి పరిస్థితులు అయినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos