ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. రాజధాని అమరావతి అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. 2029 నాటికి సమగ్రంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించడమే కాకుండా ఈ దిశగా పలు నిర్ణయాలను తీసుకుంటోంది. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) తరహాలో అమరావతి రాజధాని నగరాన్ని అభివృద్ది చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా.. అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టును ఆధారంగా చేసుకుని అమరావతిని పొరుగు నగరాలకూ విస్తరించేలా ప్రణాళికలను రూపొందంచబోతోంది చంద్రబాబు ప్రభుత్వం.
అవుటర్ రింగ్ రోడ్ వల్ల అమరావతిలో గుంటూరు, విజయవాడ నగరాలు కలిసి పోయే అవకాశం ఉందని, దీనికి అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలను రూపొందించాలంటూ చంద్రబాబు మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అమరావతి నగరానికి అవుటర్ రింగ్ రోడ్ ఎక్స్ప్రెస్ వే మంజూరు అయింది. దీని మొత్తం పొడవు 189 కిలోమీటర్లు. విజయవాడ-మంగళగిరి- గుంటూరు ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. నందిగామ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, తెనాలి, సత్తెనపల్లిని కనెక్ట్ చేస్తూ ఈ ఓఆర్ఆర్ ఎక్స్ప్రెస్ వే నిర్మితమవుతుంది.
దీని నిర్మాణ అంచనా వ్యయం ఏకంగా 25,000 కోట్ల రూపాయలు. 2014లో రాష్ట్ర విభజన చోటు చేసుకున్న తరువాత ఇంత పెద్ద మొత్తంలో రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఓ ప్రాజెక్టును మంజూరు చేయడం ఇదే తొలిసారి కావడం చర్చనీయాంశమైంది. అమరావతిలో లాజిస్టిక్, రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించడంలో భాగంగా 25,000 కోట్ల రూపాయల విలువ చేసే అతిపెద్ద ప్రాజెక్టును అమరావతికి మంజూరు చేసింది కేంద్రం. ఈ మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందంటూ గతంలో భారతీయ జనతా పార్టీకి చెందిన రాజమండ్రి లోక్సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తానికి అమరావతి నగర నిర్మాణ పనుల ప్రక్రియ వేగవంతం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos