ఇవాళ మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కాగా ఈరోజు మహా విష్ణువును వైకుంఠ ద్వారం దర్శనం చేసుకుంటే మోక్షప్రాప్తి కలుగుతుందనే లక్షలాది మంది భక్తులు విశ్వసిస్తారు. అందుకే తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి విష్ణువును ఉత్తర ద్వార దర్శనం చేసుకుని పరవశించిపోతున్నారు. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి ఆలయంలో అర్థరాత్రి వైకుంఠ ద్వారాలు తెరచుకోగా, ముందుగా వీఐపీలకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. అనంతరం సాధారణ భక్తులకు దర్శనం ప్రారంభమైంది. లక్షలాది మంది భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండి శ్రీవారిని దర్శించుకున్నారు. క్యూలైన్లు, షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు భక్తులతో నిండిపోయాయి. టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసి దర్శనాలు సాఫీగా నిర్వహిస్తుంది. పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు. వీరిలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాసులు, శాసనసభాపతులు అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజు.. ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. అలానే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. నటుడు నారా రోహిత్ దంపతులు, ఎంపీ వేమిరెడ్డి దంపతులు, భారత క్రికెటర్ తిలక్ వర్మ, వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, మిథున్ రెడ్డి, భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు కృష్ణ ఎల్లా, మేనేజింగ్ డైరెక్టర్ సుచరిత ఎల్లా సహా పలువురు ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
మరోవైపు ఇతర ప్రముఖ ఆలయాల్లోనూ భక్తుల సందడి నెలకొంది. విజయవాడ కనకదుర్గ ఆలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో ఆలయం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది. విశాఖ జిల్లా సింహాచలంలో సింహాద్రి నాథుడు వైకుంఠ నారాయణుడి అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా పూసపాటి అదితి గజపతిరాజు తొలి దర్శనం చేయడం విశేషంగా నిలిచింది. సింహాచలంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విప్ పి. గణబాబు తదితర ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. భద్రాచలంలో వైకుంఠ ద్వార దర్శనం అత్యంత వైభవంగా నిర్వహించారు. గరుడ వాహనంపై శ్రీరామచంద్రస్వామి, గజ వాహనంపై సీతమ్మ, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఈ పవిత్ర పండుగ సందర్భంగా ప్రజలందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షల సందేశాన్ని పంచుకున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos