అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరు వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ప్రతిపక్ష హోదా పైన జగన్ హైకోర్టును ఆశ్రయించారు. సభలో తమకు ప్రతిపక్ష నేతకు ఇచ్చే సమయం ఇవ్వాలని జగన్ కోరుతున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీకి తమ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్తానంటే అభ్యంతరం లేదని జగన్ చెబుతున్నారు. కాగా, ఇదే అంశం పైన అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ చర్చించింది. కమిటీలోని సభ్యులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసారు. దీంతో.. ఇక కీలక పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.
ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు శాసనసభకు హాజరుకాకుండా కేవలం సంతకాలు చేసి సర్దుకోవడం ఏం నైతికత అని ఎథిక్స్ కమిటీ అభిప్రాయపడింది. జీత భత్యాలతో పాటు ప్రొటోకాల్ మర్యాదలు పొందుతూ అసెంబ్లీకి రాకపోవడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను విస్మరించడంపై చర్చ జరగాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు సభకు వచ్చి చట్టాల నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిందేనని తేల్చి చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు రాకపోవడం నైతికత ఎలా అవుతుందనే అంశాన్ని కమిటీ సభ్యులు లేవనెత్తారు. ఇది వారి బాధ్యతను విస్మరించటమేననే అభిప్రాయం వ్యక్తం అయింది.
ఎమ్మెల్యేలు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంత సమస్యలను శాసనసభా వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి పాటుపడాలని హితవు పలికారు. సభకు రాకుండా ఈ బాధ్యతను విస్మరించడం అనైతికమే అవుతుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. సభకు రాకపోవడం అనైతికమని, తమ బాధ్యతను గుర్తించి వ్యవహరించాలని కమిటీ తరపున విజ్ఞప్తి చేద్దామనే అభిప్రాయాన్ని కొందరు సభ్యులు వ్యక్తం చేశారు. ఎవరెవరు జీతభత్యాలు తీసుకుంటున్నారు, ఎవరెవరు సభకు రాకుండా బయట రిజిస్టర్లో సంతకాలు చేసి వెళుతున్నారనేదీ రికార్డులను పరిశీలించి అప్పుడు ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని ఇతర సభ్యులు అభిప్రాయపడ్డారు. దీంతో వచ్చే సమావేశం నాటికి ఈ రికార్డులను కమిటీ ముందుంచాలని ఛైర్మన్ బుద్ధప్రసాద్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ను ఆదేశించారు. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోవడంపై హౌస్ ఇంటా బయట విమర్శలు వస్తున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos