ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం (దీపం పథకం) అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ పథకానికి దీపావళి పండగ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వ మార్గ దర్శకాల మేరకు అర్హులైన వారికి సిలిండర్లను అందజేస్తారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు. ఎల్పీజీ కనెక్షన్ ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి వర్తించే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు తాజాగా విడుదల చేశారు.
ఈ పథకానికి ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ పథకం ప్రయోజనం పొందేవారు అర్హులు. మిగతా వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.. ఉజ్వల గ్యాస్ లబ్దిదారులకు సులభంగా ఈ సిలిండర్ల పథకం అమలవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండి.. ఆర్థికంగా వెనకబడినవారంతా అర్హులే. బీపీఎల్ కుటుంబాలు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారిని ప్రమాణికంగా తీసుకోనున్నారు. ఆధార్ కార్డ్, గ్యాస్ కనెక్షన్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, రేషన్ కార్డ్, మొబైల్ నంబర్, కరెంట్ బిల్లు, నేటివిటీ సర్టిఫికెట్లు రెడీ చేసుకుంటే మంచిదని అధికారులు చెబుతున్నారు.
ఈ మూడు ఉచిత సిలిండర్ల పథకం కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్లో ఉన్న విధంగా పేరు, చిరునామా రాయాలి. అనంతరం డాక్యుమెంట్స్ ఫొటోలు అప్ లోడ్ చేయాలి. చివరగా యాక్సెప్ట్ చేసి, సబ్ మిట్ చేయడంతో దరఖాస్తు పూర్తవుతుంది. ఈ అప్లికేషన్లను అధికారులు పరిశీలించి.. అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు.. ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ జాబితాలను ప్రదర్శించాలని భావిస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ మూడు సిలిండర్ల పథకం అమలు చేస్తే.. ప్రభుత్వంపై ఏడాదికి రూ.2,684 కోట్ల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.13,423 కోట్లవుతుందని భారం పడుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.876 ఉంటే.. ఇందులో రూ.25 మొత్తం రాయితీ లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తారు. లబ్ధిదారులు ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఒక సిలిండర్ పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కేబినెట్ సమావేశంలో ఈ ఉచిత సిలిండర్ల పథకానికి ఆమోదం తెలపడమే తరువాయి. ఇక మహిళల కళ్ళల్లో దీపం వెలుగులు విరజిమ్మనున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos