ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. రంపచోడవరం, మారేడుమిల్లి అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టు నేతలు చనిపోయారు. చనిపోయిన వారిలో మావోయిస్టుల అగ్రనేత చలపతిరావు భార్య అరుణ, గాజర్ల రవి అలియాస్ ఉదయ్, అంజు ఉన్నారు. మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో మూడు ఏకే 47 రైఫిల్స్ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కొండమొదలు, కొయ్యలగూడెం, చింతకూరు దగ్గర ఈ కాల్పులు జరిగాయి. చనిపోయిన వారిలో అరుణ స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. గాజర్ల రవి కేంద్ర కమిటీ సభ్యుడు కాగా.. అంజు ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీలో ఏసీఎంగా ఉన్నారు.
మావోయిస్టుల అగ్రనేత చలపతిరావు భార్య అరుణ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితురాలుగా ఉన్నారు. 2018లో డుంబ్రిగుడ దగ్గర వారిని మావోయిస్టులు కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. అరుణ సొంత ఊరు విశాఖపట్నం జిల్లాలోని కరకవానిపాలెం కాగా.. ఉదయ్పై రూ.25 లక్షలు, అరుణపై రూ.20 లక్షల రివార్డు ఉంది. ఈ ఎన్కౌంటర్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంతేకాదు గత రెండు, మూడు నెలలుగా వరుసగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో దాదాపు 200మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లలో ఎక్కువమంది చనిపోయారు. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారు. తాజాగా చలపతి భార్య అరుణ కూడా ప్రాణాలు కోల్పోయారు.
2025 జనవరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భద్రతా బలగాల ఎన్కౌంటర్లో చనిపోయారు. ఛత్తీస్గఢ్-ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఉన్న గరియాబంద్ జిల్లా కుల్హాడీఘాట్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గడ్, ఒడిశా పోలీసులతో పాటుగా సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు.. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో మావోయిస్టుల అగ్రనేత చలపతితో సహా 14మంది చనిపోయారు. చలపతి అసలు పేరు రామచంద్రారెడ్డి కాగా.. చిత్తూరు జిల్లాకు చెందినవారు. ఆయన మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు.. ఆయనపై ఏకంగా రూ.కోటి రివార్డ్ ఉంది. 2008లో ఒడిశాలో భద్రతా బలగాలపై చేసిన దాడికి ఈయనే ప్రధాన సూత్రదారి. ఈ ఘటనలో 13మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. 2018లో అరకు ఎమ్మెల్యేగా ఉన్న కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో చలపతి పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. ఎంతో కాలంగా చలపతి అజ్ఞాతంలో ఉన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos