ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ దివంగత కొణిజేటి రోశయ్య సతీమణి కొణిజేటి శివలక్ష్మి ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా వయోభార సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని అమీర్ పేటలో ఉన్న తమ నివాసంలో నేడు తుది శ్వాస విడిచారు.ఈ విషాద వార్త కొణిజేటి రోశయ్య కుటుంబంతో పాటు ఆయన సన్నిహితులను తీవ్రంగా కలిచివేసింది. రోశయ్య రాజకీయ ప్రస్థానంలో ఆయన సతీమణి శివలక్ష్మి పాత్ర చాలా కీలకమైనది. రోశయ్యకు అండదండగా నిలిచి, ఆయనకు కావలసిన ధైర్యాన్ని ఇచ్చి ప్రజాసేవలో ముందుకు వెళ్లేలా చేసిన ఘనత ఆమెది. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా, కుటుంబ శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చి చూసుకున్నారు. రోశయ్య అత్యున్నత పదవులను అలంకరించిన కూడా నిరాడంబరంగా జీవించారు. రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం గా పని చేస్తున్న సమయంలో.. ఆయన సతీమణి ఏ రోజూ తను సీఎం భార్యను అన్న అహంకారాన్ని చూపించలేదు. 2021లో రోశయ్య మరణానంతరం నుంచి ఆమె తన కుమారులతో కలిసి అమీర్ పేట లో నివసిస్తున్నారు. శివలక్ష్మి మృతి చెందారన్న వార్త తెలియగానే అనేక రాజకీయ నేతలు వారి నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.
పార్టీలకు అతీతంగా కొణిజేటి రోశయ్య అందరితోటి సత్సంబంధాలు కలిగి ఉన్న కారణంగా కాంగ్రెస్,బీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ వంటి పార్టీల నుండి సీనియర్ నేతలు ఆమెకు సంతాపం తెలిపారు. సౌమ్యురాలిగా, ఆదర్శ గృహిణిగా ఆమె కుటుంబాన్ని తీర్చిదిద్దారని పలువురు ఈ సందర్భంగా కొనియాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు దివంగత రోశయ్య సతీమణి శివలక్ష్మి మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రోశయ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. అయినప్పటికీ వారిలో ఎవరూ రాజకీయాలలోకి రాలేదు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos