టీడీపీ మాజీ ఎంపీకి కీలక పదవి దక్కింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ నుంచి ఇప్పటికే ఒక గవర్నర్ పదవి కేటాయించారు. కేంద్రంలో ఇద్దరు మంత్రులు కొనసాగుతున్నారు. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించారు. కాగా.. టీడీపీ మాజీ ఎంపీకి ఇప్పుడు తాజాగా ముఖ్యమైన పదవి ఖరారైంది. చంద్రబాబు సిఫారసు మేరకు ఆయనకు ఈ పదవి కేటాయించినట్లు సమాచారం. అదే సమయంలో కేంద్రంలో టీడీపీకి మరికొన్ని నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది.
టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కు కేంద్రం కీలక పదవి కట్టబెట్టింది. కేంద్రం తాజాగా సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ పదవులను ప్రకటించింది. అందులో టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన కనకమేడల రవీంద్ర కుమార్ కు కేటాయించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుల్లో కనకమేడల మినహా మిగిలిన సభ్యులు బీజేపీలో విలీనం అయ్యారు. కనకమేడల మాత్రం టీడీపీలోనే కొనసాగారు. తొలి నుంచి పార్టీ లీగల్ వ్యవహారాల్లో కనకమేడల కీలకంగా వ్యవహరించారు. 2024 ఎన్నికల సమయంలో బీజేపీ - టీడీపీ పొత్తు వేళ కనకమేడల తన వంతు పాత్ర పోషించారు. కేంద్రంలో ఎన్డీఏ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కనకమేడలకు కీలక పదవి దక్కుతుందని పార్టీ నేతలు అంచనా వేసారు.
ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ పదవికి దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన న్యాయపదవుల్లో ఒక్కటిగా గుర్తింపు ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించిన న్యాయ అంశాలపై కనకమేడల రవీంద్ర కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పర్యటనలో భాగంగా కనకమేడలకు అదనపు సొలిసిటర్ జనరల్ పదవి పైన సీఎం చంద్రబాబు ఢిల్లీ ముఖ్యులతో సంప్రదింపులు చేసారు. కేంద్రంలో పదవుల కోటాలో భాగంగా టీడీపీ నుంచి కనకమేడల పేరు ఖరారైంది. అదే విధంగా మరి కొందరికి కేంద్రం లో నామినేటెడ్ పదవుల కోసం పేర్లు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. మరో గవర్నర్ పదవి సైతం టీడీపీకి కేటాయిస్తారనే ప్రచారం ఉంది. కాగా.. ఈ పదవి బీసీ వర్గానికి ఇస్తారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కనకమేడలకు కీలక పదవి దక్కటం ద్వారా.. త్వరలోనే ఇతర పోస్టులను భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos