రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురువారం శంకుస్థాపన చేశారు. రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో కేంద్రంతో కలిసి కూటమి ప్రభుత్వం అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టింది. విదేశీ పర్యాటకులనూ ఆకర్షించేలా చారిత్రక నగరం రాజమహేంద్రవరం నగరాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. కేంద్రం నిధులు రూ. 375 కోట్లతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని తిలకించారు. గోదావరి తీరం రివర్ ఫ్రంట్ వ్యూ పాయింట్ నుంచి అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టే ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది తీరం. ఇలాంటి చోట నాగరికత, భాష ఉంటాయి. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ జన్మించిన నేల. ఆదికవి నన్నయకు జన్మనిచ్చిన నేల. బాపు రమణల్లో ఒకరైన ముళ్లపూడి వెంకటరమణ సహా ఎంతో మంది సాహితీవేత్తలు, ప్రముఖులు పుట్టిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేద్దామని భావించాం. రూ.430 కోట్లతో ఈరోజు మొత్తం 7 ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నామని, ముఖ్యమైనది అఖండ గోదావరి ప్రాజెక్టు అని అన్నారు.
అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామని, పర్యాటక రంగంలో 800 మందికి ఉపాధి దొరుకుతుందని, అన్ని ప్రాజెక్టులు, పనులు పూర్తయితే ఏడాదికి 4 లక్షల మంది పర్యాటకులు వస్తారని, ఎంపీ పురంధేశ్వరి చెప్పినట్లు డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి పవన్ కళ్యాణ్ వివరించారు. రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ మన ప్రభుత్వం ఉంటే పనులు వేగంగా, అనుకున్నట్లుగా జరుగుతాయని, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అర్థం ఇదేనని అన్నారు. పవన్ కళ్యాణ్ విమానాశ్రయం నుంచి నేరుగా పుష్కర ఘాట్ కు చేరుకుని అఖండ గోదావరి ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos