ఏపీలో మరోసారి విషవాయువు లీకేజీ కలకలం లేపింది. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో ఉన్న రక్షిత డగ్ర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి హైడ్రోజన్ సల్ఫైడ్ విషవాయువు లీక్ కాగా.. ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన తోటి కార్మికులు, యాజమాన్యం వెంటనే గాజువాకలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. ఇద్దరు కార్మికులకు వైద్యం అందిస్తున్నారు. కంపెనీ యాజమాన్యం గ్యాస్ లీక్ కావడానికి కారణాలను గుర్తించే పనిలో ఉంది.. పోలీసులు కూడా ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల కాలంలో పరవాడ ఫార్మాసిటీలో ఉన్న కంపెనీల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. నెల కిందట ఠాగూర్ ఫార్మా లేబొరేటరీలో విషవాయవులు లీక్ కావడంతో కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన కార్మికుడు ప్రాణాలు కోల్పోగా.. మరో 9మంది తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఈ నెల 6న కూడా ఫార్మాసిటీలోని శ్రీ ఆర్గానిక్స్ ఫార్మా కంపెనీలో మరో ఘటన జరిగింది. ఫార్మా సిటీలో ఇలా వరుస ఘటనలతో కార్మికులు భయాందోళనలో ఉన్నారు. అదేవిధంగా ఈ ఏడాది ఆగస్టులో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 17మంది చనిపోగా.. 30మందికిపైగా గాయాలయ్యాయి. ఇలా వరుస ఘటనలతో కార్మికులు భయాందోళనలు చెందుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంపెనీల్లో ప్రమాదాల విషయంలో అప్రమత్తం అయ్యింది. యాజమాన్యాలు నిబంధనలు పాటిస్తూ కంపెనీల్లో కార్మికులకు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos