కరవు భయం కమ్ముకున్న వేళ ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్. గురువారం నుంచి వారం రోజులు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఆగ్నేయ ఉత్తర ప్రాంతం వద్ద కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని విశాఖ వాతావరణ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఏపీలోని కొన్ని జిల్లాలో వాతావరణం చల్లబడింది. అక్కడక్కడా చిరు జల్లులు పడుతున్నాయి. వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాల్లో ఐదు రోజుల పాటు బలమైన గాలులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో నేడు, రేపు బారీ వర్షాలు కురవనున్నాయి. గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లాలో 12 సెంమీ అత్యధిక వర్షపాతం నమోదు అయింది. వర్షాలు లేక అల్లాడుతున్న రైతాంగానికి ఇది చల్లని కబురనే చెప్పాలి.
అదేవిధంగా తెలంగాణలోనూ శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి సహా జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. శుక్రవారం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట వరకు వర్షాలు కురుస్తాయని అంచనా. ప్రభావిత ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేయడం జరిగింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో సురక్షితంగా ఉండాలని, చెట్లు విరిగిపడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos