ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత ప్రభుత్వంలో హక్కుల కోసం టీచర్లు రోడ్డెక్కారని.. గత ప్రభుత్వం టీచర్లపై పెట్టిన కేసులు ఎత్తి వేస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నామని.. ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్లో ఉపాధ్యాయుల్ని భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. ఉపాధ్యాయుల విధులపై జీవో 117కు ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నామని.. ఉపాధ్యాయులను బోధన విధులకు మాత్రమే పరిమితం చేస్తామని తెలిపారు. ఉపాధ్యాయులతో చర్చలకు సిద్ధమన్నారు. ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోడానికి సమయం కేటాయించామన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. డీఎస్సీ విషయంలో న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. డీఎస్సీపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని.. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోపు డీఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు. డీఎస్సీకి సంబంధించి కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సి ఉందని.. న్యాయపరంగా ఎలాంటి వివాదాలు తావు లేకుండా నోటిఫికేషన్ ఇస్తామన్నారు. 1994 నుంచి డీఎస్సీపై, గతంలో డీఎస్సీలపై పడిన కేసుల ఫైల్స్ ను తెప్పించుకుని పరిశీలిస్తున్నామని.. పకడ్బందీగా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.
గత ఐదేళ్లలో ఉద్యోగ నియమకాలు సున్నా.. డీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు భర్తీ చేయలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే మొత్తంగా 15సార్లు డీఎస్సీ నిర్వహించామన్నారు. ప్రస్తుతం కూటమి సర్కార్ మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందని.. ఉపాధ్యాయ నియామకాల్లో వయో పరిమితి పెంపు డిమాండ్ను పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు. అన్ని శాఖల మధ్య ఫైల్ సర్క్యూలేషన్లో ఉందని.. ఎంత వయోపరిమితి పెంచుతామనేది త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీకి కట్టుబడి డీఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేశారన్నారు. మెగా డీఎస్సీ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు మంత్రి లోకేష్.
మరోవైపు రాష్ట్రంలో 20 నుంచి 30 కిలోమీటర్ల మధ్య డిగ్రీ కళాశాల ఉండాలనే నిబంధన ఉందన్నారు మంత్రి. గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్ధులకు టెక్ట్స్ బుక్స్ కూడా ఇవ్వలేదని.. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్కు చాలా తేడా ఉంటుందన్నారు. ఈ ఏడాది 10 శాతం అడ్మిషన్లు పెరిగాయని.. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు నారాయణ కాలేజీలతో పోటీ పడేలా నడుపుతామన్నారు. అంతేకాదు రాష్ట్రంలో స్కూల్లకు ర్యాంకింగ్ మెకానిజం పెడదామనే ఆలోచన ఉందని..డిసెంబర్ మొదటి వారంలో పిటీఎం నిర్వహిస్తున్నామని.. సభ్యులు కూడా పాల్గొనాలని కోరారు లోకేష్.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos