ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలోని సచివాలయం వేదికగా మూడున్నర గంటలపాటు ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. సుమారుగా 70 అజెండా అంశాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటుతో పాటుగా.. పలు సంస్థలకు భూములను కేటాయించే విషయమై సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పలు కంపెనీలకు భూకేటాయింపులో రాయితీలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
మరోవైపు రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల విషయంపైనా కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పేదలకు ఇళ్లు అందించే విషయంలో నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే రాష్ట్రంలో సొంత నివాస స్థలం లేనివారిని గుర్తించాలని. అలాంటి వారి జాబితా రూపొందించి అందరికీ ఇంటి స్థలాలు దక్కేలా చూడాలని చంద్రబాబు సూచించారు. నివాస స్థలం లేని వారిని గుర్తించి ఏడాదిలోగా వారికి లబ్ధి కలిగించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వం చేసే మంచిని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించాలన్నారు.
మరోవైపు విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సు గురించి కూడా ఏపీ కేబినెట్ భేటీలో చర్చించారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ఏం చేస్తున్నదనేదీ యువతకు తెలియజేయాలన్నారు. స్కూళ్లల్లో ఆసక్తి ఉన్నవారికి సదస్సు చూసేలా ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. ఇదే సమయంలో రాజకీయ అంశాలపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తున్నట్లు గుర్తిస్తే.. ఆ జిల్లా ఇన్ చార్జి మంత్రులు జోక్యం చేసుకోవాలని.. వాటిని సరిచేయాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఇక ఎర్ర చందనం అక్రమ రవాణా కట్టడికి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు అభినందించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos