ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ సొంత నియోజకవర్గం మంగళగిరికి చెందిన ఓ కీలక ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రైల్వేశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మంగళగిరి - కృష్ణ కెనాల్ స్టేషన్ల మధ్య E13 ఎక్స్టెన్షన్ రోడ్డు వద్ద ఆర్వోబీ నిర్మాణ ప్రతిపాదనకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ఆర్వోబీని రూ.112 కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించనున్నారు. ఈ ఆర్వోబీ రాజధాని అమరావతిని, 16వ నంబర్ జాతీయ రహదారిని అనుసంధానించేలా నిర్మించనున్నారు. మరోవైపు ఈ ఆర్వోబీకి అయ్యే నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా రైల్వేశాఖ భరించనున్నట్లు సమాచారం.
మరోవైపు ఈ ఆర్వోబీ తొలుత నాలుగు లైన్లుగా నిర్మించాలని భావించారు. అయితే అమరావతి భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆరు వరుసలుగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలకు రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. మరోవైపు ఈ ప్రాజెక్టు టెండరింగ్ ప్రక్రియ చేపట్టేముందు మరికొన్ని పనులు పూర్తి చేయనున్నారు. డిజైన్ల ఆమోదం, సాధారణ డ్రాయింగ్లు వంటి పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఆర్వోబీ నిర్మాణం పూర్తి అయితే అమరావతి వైపు వెళ్లే రహదారి ట్రాఫిక్ సజావుగా సాగడానికి సహకరిస్తుందని అధికారులు చెబుతున్నారు.
మంగళగిరి - కృష్ణా కెనాల్ స్టేషన్ల మధ్య ఆరు వరుసల రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి వెల్లడించారు. 112 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వివరించారు. ఈ ఆర్వోబీ అమరావతిని, 16వ నంబర్ జాతీయ రహదారిని అనుసంధానిస్తుందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చును దక్షిణ మధ్య రైల్వే భరించనున్నట్లు వివరించారు. ప్రతిపాదించిన ఈ రైల్వే ట్రాక్ చెన్నై-హౌరాను విజయవాడ మీదుగా కలిపే ముఖ్యమైన లైన్ అని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటంతో చాలా రోజుల నుంచి స్తబ్దుగా ఉన్న ప్రాజెక్టులకు మోక్షం కలుగుతోంది. ఈ క్రమంలోనే అమరావతిలో ఆర్వోబీ నిర్మాణ ప్రతిపాదనకు తాజాగా రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos