మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది అవినీతి ప్రభుత్వం అని ఆరోపిస్తూ, తొమ్మిది నెలల్లో వేల కోట్లు అప్పులు చేసి, వాటిని ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలంటూ ప్రశ్నించారు. నేడు తాడేపల్లి లో జరిగిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ, "బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రచారం చేశారు.. కానీ ఇప్పుడు "బాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ అయ్యింది" అంటూ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత తొమ్మిది నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 1.40 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని తెలిపారు. ఇందులో బడ్జెటరీ అప్పులే రూ.80,820 కోట్లు కాగా, ఏపీmఎండీసీ ద్వారా మరో రూ.5,000 కోట్లు అప్పుగా తీసుకున్నారు.
"ఇన్ని వేల కోట్లు అప్పులు చేసినా పేదలకు ఏదైనా మేలు చేశారా? సంక్షేమ పథకాలు అమలు చేశారా? చివరకు ఈ డబ్బులు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయి?" అంటూ జగన్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయినా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. "ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో ఏమయ్యింది? పథకాల అమలుకు సంబంధించి బాండ్లు ఏమయ్యాయి? ఇప్పుడు ఎవరి చొక్కాలు పట్టుకుని నిలదీయాలంటూ జగన్ కూటమి నేతలను ప్రశ్నించారు.
గతంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలు ఇప్పుడు ఆగిపోయాయని ఆరోపించారు. "బటన్ నొక్కడం గొప్పనా? ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది!" అంటూ గతంలో చంద్రబాబు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారని, ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు బటన్ నొక్కావచ్చు కదా అని జగన్ ఎద్దేవా చేశారు "ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఐఆర్ (ఇంటరిమ్ రిలీఫ్) ఇస్తామన్నారు.. కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు .గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తున్నారు. వాలంటీర్లను మోసం చేసినట్లే ఉద్యోగులను కూడా మోసం చేస్తున్నారని జగన్ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఢిల్లీలో కేజ్రీవాల్ చేయలేని పనిని ఏపీలో చంద్రబాబు విజయవంతంగా చేసి చూపించారని జగన్ ఎద్దేవా చేశారు. మద్యం షాపులను ప్రైవేటీకరించే ప్రయత్నం చేసి కేజ్రీవాల్ జైలుకు వెళ్లారని, అయితే, చంద్రబాబు మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి ఏపీలో మద్యం షాపులను విజయవంతంగా ప్రైవేటీకరించారని ఆరోపించారు. మద్యం షాపులకు టెండర్లు లేవు, లాటరీ విధానంలో తమ కార్యకర్తలకు కట్టబెట్టారని చెప్పారు. పోలీసుల సాయంతో మిగతా వాళ్లను బెదిరించి మద్యం షాపులన్నీ తమ కార్యకర్తలకే దక్కేట్లుగా చంద్రబాబు ప్రభుత్వం చక్రం తిప్పిందని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో కంటే రెట్టింపు రేట్లకు ఇసుక అమ్ముతున్నారని జగన్ ఆరోపించారు. ఇసుక, మద్యం, ఫ్లై యాష్.. ఇలా అన్నీ మాఫియాలేనని విమర్శించారు. ప్రతీ నియోజకవర్గంలో, మండలంలో, గ్రామంలో పేకాట క్లబ్లు నడిపిస్తున్నారని చెప్పారు. ఇవన్నీ పెదబాబు, చిన్నబాబు ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో పెదబాబుకు ఇంత, చినబాబుకు ఇంత, దత్తపుత్రుడికి ఇంత అనే వ్యవహారం నడుస్తోందని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos