ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శన, విక్రయ కేంద్రాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గురువారం ప్రారంభించారు. ఆప్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టాళ్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి, చేనేత కార్మికులతో ముచ్చటించారు. వారి నైపుణ్యాన్ని అభినందించడమే కాకుండా స్వయంగా పట్టుచీరలు, పట్టు పంచె, షర్ట్ను కొనుగోలు చేసి కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపారు.
దేశవ్యాప్తంగా ఉన్న చేనేత సంఘాలలో మన రాష్ట్రం నుంచే అత్యధికంగా 33 సంఘాలు ఉండటం గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వస్త్రాలన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉన్నాయని, ప్రజలందరికీ మన చేనేత వైభవం తెలియజేసేందుకే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు స్పీకర్ తెలిపారు. నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని, మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు అందరూ ఈ స్టాళ్లను సందర్శించి వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆయన కోరారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు అందుబాటులో ఉండే ఈ స్టాళ్లలో నాణ్యమైన వస్త్రాలపై 40 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి, కార్మికులను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో తయారవుతున్న ప్రఖ్యాతిగాంచిన చేనేత ఉత్పత్తులను ఈ స్టాళ్లలో విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నారు. పొందూరు షర్ట్ లు, పంచెలు, కండువాలు, మాధవవరం, వెంకటగిరి, ధర్మవరం, రాజమండ్రి, ఉప్పాడ, బందరు పట్టు, సాధారణ చీరలతో పాటు ఇంటిల్లిపాది వినియోగించుకునే రెడీమేడ్ దుస్తులను ఈ స్టాళ్లలో అమ్మకానికి అందుబాటులో ఉంచారు. లుంగీలు, టవళ్లు, దుప్పట్లు, ఇతర చేనేత వస్త్రాలను సైతం అమ్మకానికి పెట్టారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos