డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పరిధిలోని శాఖల్లో సంస్కరణలపై దృష్టి సారిస్తున్నారు. మరోవైపు తనకు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశం కల్పించిన పిఠాపురం నియోజకవర్గంపైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారాలను సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురం అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు రావడంతో... దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఎక్స్ వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి రూ. 59.70 కోట్లు మంజూరు చేసి, పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
"పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు - రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి.. పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి ₹59.70 కోట్లు మంజూరు చేసి, పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నికల సమయంలో నేను ఈ వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చాను. సామర్లకోట- ఉప్పాడ రహదారిలో రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు రోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత రాకపోకలు సులభతరం అవుతాయి.. ప్రజల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ రహదారి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (CRIF) సేతు బంధన్ పథకంలో భాగంగా చేపట్టడమైనది. ఈ ఆర్వోబీకి నిధులు మంజూరు చేసి అండగా నిలిచిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరి గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వంతెన త్వరగా ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నాను" అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos