ఏపీలో హైకోర్టు బెంచ్ ను అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు వీలుగా తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కేంద్రం ఆమోదిస్తే తరలింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే ఇప్పటికే కర్నూలులో ఉన్న లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాలు అక్కడే ఉంటాయా లేదా అమరావతికి తరలిస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో హైకోర్టు బెంచ్, హెచ్ఆర్సీ, లోకాయుక్త ఆఫీసులపై మంత్రి టీజీ భరత్ ఇవాళ క్లారిటీ ఇచ్చారు.
కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఆరు నెలల్లో తరలించనున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. అలాగే హైకోర్టు బెంచ్ కు కర్నూలు లో శాశ్వత భవనం ఏడాదిన్నరలో ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం న్యాయ రాజధాని అని చెప్పి మోసం చేసిందని, కానీ తాము బెంచ్ ఏర్పాటు చేస్తామని మాత్రమే ఎన్నికల్లో హామీ ఇచ్చామని, అసెంబ్లీలో ప్రకటనకు ముందే బెంచ్ తరలింపు ప్రక్రియ ప్రారంభించినట్లు టీజీ భరత్ వెల్లడించారు.
అలాగే ఇప్పటికే కర్నూలులో ఉన్న లోకాయుక్త, హెచ్ఆర్సీ ఆఫీసుల్ని అమరావతికి తరలిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపైనా మంత్రి టీజీ భరత్ క్లారిటీ ఇచ్చారు. ఈ రెండు కార్యాలయాలు కూడా కర్నూలు లోనే కొనసాగుతాయన్నారు. వీటి తరలింపు వైసీపీ చేస్తున్నదంతా దుష్ప్రచారమే అని తేల్చిచెప్పేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం న్యాయ రాజధాని ఏర్పాటులో భాగంగా లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాలను హైదరాబాద్ నుంచి కర్నూలుకు తరలించిన విషయం తెలిసిందే.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos