కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన నేత అరవ శ్రీధర్ అక్రమ సంబంధం కేసుపై ఇవాళ హైకోర్టు స్పందించింది. తనపై నమోదైన అక్రమ సంబంధం కేసును క్వాష్ చేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో పంచాయతీ ఆఫీసులో పనిచేస్తున్న హర్ష వీణ అనే ఉద్యోగిని గత నెలలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపులు, అక్రమ సంబంధం ఆరోపణలు చేసింది. అనంతరం పలు వీడియోలు కూడా విడుదల చేసింది.
దీనిపై స్పందించిన జనసేన పార్టీ ఆయన్ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచింది. అలాగే పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దీంతో అరవ శ్రీధర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అరవ శ్రీధర్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ వ్యవహారంలో ఆయనకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఎమ్మెల్యేపై అరెస్టు వంటి కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది.
ఒకవేళ అరెస్టు చేయాల్సి వచ్చినా రాతపూర్వకంగా కారణాలను నమోదు చేయాలని పోలీసులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లాయర్లు తమ క్లయింట్ పై రాజకీయ కక్షతో ఈ కేసు పెట్టారని, అందుకే దీన్ని కొట్టేయాలని కోరారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు శ్రీధర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. అయితే, తనపై ఆమె చేసిన ఆరోపణలు నిజం కాదని ఎమ్మెల్యే తొలి నుంచి వాదిస్తున్నారు. మరోవైపు, పార్టీ పరంగా కూడా ఈ విషయంపై జనసేన అధిష్ఠానం త్రిసభ్య కమిటీతో విచారణ జరిపించిన సంగతి తెలిసిందే.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos