అమరావతిపై కేంద్రం నుంచి బిగ్ అప్డేట్ అందుతోంది. సుదీర్ఘ కాలంగా రైతులు.. ప్రభుత్వం కోరుకున్న విధంగా నిర్ణయం జరగనుంది. ఇందు కోసం ముహూర్తం ఖరారైంది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి అమరావతి కేంద్రంగా వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేంద్రం ఆర్దికంగా తోడ్పాటు అందించింది. మూడేళ్ల కాల పరిమితితో నిర్మాణాలు చేపట్టారు. కాగా.. ఇప్పుడు కేంద్రం కీలక నిర్ణయం ఆమోదం దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరింది.
ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధం అయింది. వచ్చే వారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో .. ఈసారి జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం తర్వాత పార్లమెంట్ లో బిల్లు పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ కాలపరిమితి 2024 జూన్ రెండు తో ముగిసింది. రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఖరారు చేసారు. దీంతో.. 2024 జూన్ 2 నుంచి రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీని పైన రాజధాని ఎంపిక ప్రక్రియ ,నిర్మాణాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వివరాలు సమర్పించింది.
ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్ధనపైన కేంద్ర హోం శాఖ సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలను అభిప్రాయాలు కోరింది. కాగా.. కేంద్ర మంత్రిత్వ శాఖలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ఇంకా పట్టణాభివృద్ధి, న్యాయశాఖలు తమ అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని ప్రకటించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దీనికి ముందే మరోసారి ఏపీ ప్రభుత్వంతోనూ చర్చించనుంది. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేముందు కేబినెట్ లో చర్చించి తుది ఆమోదం ఇవ్వనున్నారు. ఈ మేరకు క్యాబినెట్ నోట్ తయారీలో హోంశాఖ నిమిగ్నమైనట్లు అధికార వర్గాల సమాచారం. తాజాగా అమరావతి రైతులు సైతం ఇదే అంశం పైన ఏపీ ప్రభుత్వం వద్ద ప్రస్తావించారు. ప్రభుత్వం మారినా.. అమరావతే రాజధానిగా కొనసాగే విధంగా చట్టబద్దత కావాలని డిమాండ్ చేసారు. మొత్తానికి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఏపీ రాజధానిగా అమరావతికి రాజ ముద్ర ఖాయంగా కనిపిస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos