ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతి రీలాంఛింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలోని ఓ బృందం గుజరాత్లో పర్యటిస్తోంది. అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ లోని ఏక్తానగర్లో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ స్టాట్యూ ఆఫ్ యూనిటీని మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు.
అమరావతిలో ఎన్టీఆర్తోపాటు మరికొంతమంది ప్రముఖుల భారీ విగ్రహాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఏక్తానగర్లోని 597 అడుగుల ఎత్తయిన పటేల్ విగ్రహాన్ని నారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం పరిశీలించింది. పటేల్ విగ్రహాన్ని ఎలా నిర్మించారు. ఎలాంటి టెక్నాలజీ వాడారనే దానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎల్అండ్టీ ప్రతినిధులు.. ఏపీ బృందానికి పవర్ పాయిట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ అంశాలు వివరించారు. మరోవైపు అమరావతి ప్రాంతంలోని నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) డీపీఆర్ తయారీ కోసం కన్సల్టెన్సీల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది. మే 14వ తేదీలోగా ఆర్ఎఫ్పీ సమర్పించాలని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) సూచించింది. మరోవైపు అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని 2018లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. 14 ఎకరాల్లో, 32 మీటర్ల ఎత్తుతో ఎన్టీఆర్ విగ్రహం, స్మారకం నిర్మించాలని భావించారు. ఆరు మోడల్స్ కూడా పరిశీలించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవటంతో ఈ ప్రాజెక్టు వెనుకబడింది.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడంతో అమరావతికి పునర్వైభవం వచ్చింది. ఇప్పటికే రాజధానిలో పనులు జోరందుకున్నాయి. గతంలో ప్రారంభించి వదిలేసిన అనేక ప్రాజెక్టులను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే అమరావతి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది. ఎన్టీఆర్ విగ్రహంతో పాటుగా ఆ పరిసర ప్రాంతాలను టూరిస్ట్ స్పాట్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం పటేల్ విగ్రహాన్ని పరిశీలించింది. మరోవైపు అమరావతిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించాలని ఏసీఏ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో గుజరాత్లోని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్టేడియాన్ని కూడా మంత్రి నారాయణ, ఏపీ బృందం పరిశీలించిందని అధికారులు చెబుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos