తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై ఇవాళ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సిండికేట్ గా ఏర్పడి కల్తీ నెయ్యి కుట్ర చేశారని వైసీపీ హయాంపై ఆరోపణలు చేశారు. 59.71 లక్షల టన్నుల కల్తీ నెయ్యి సరఫరా చేశారని, ఇందుకు రూ.234 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ల్యాబ్ల కన్నుగప్పి టెండర్లు దక్కించుకున్నారని ఆరోపించారు. 20.01కోట్ల లడ్డులు కల్తీ నెయ్యితో చేసి విక్రయించారన్నారు. తప్పు చేసిన అధికారులపై యాక్షన్ తీసుకోవాలని సీబీఐ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, టీటీడీలో కొన్ని కరెక్షన్ చేయాలని చెప్పిందన్నారు. ఆ నివేదికను కూడా టీటీడీకి పంపినట్లు తెలిపారు. ఏకసభ్య కమిషన్పై మళ్లీ సుబ్రహ్మణ్యస్వామితో పిటిషన్ వేయించారని, దాన్ని కోర్టు కొట్టేసిందని బాబు గుర్తుచేశారు. కల్తీ కుట్రకు 2020 జనవరి-ఫిబ్రవరి మధ్య టెండర్ నిబంధనల్ని మార్చారని, నాణ్యతా ప్రమాణాలు తగ్గించారని చంద్రబాబు తెలిపారు. 2022 మేలో భోలేబాబా సంస్థపై ఫిర్యాదు రాగా విచారణకు ఆదేశించారని, 2022 ఆగస్టులో బీటా సిటోస్టెరాల్తో నెయ్యి కల్తీ జరిగిందని ఇచ్చిన సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్ రిపోర్టును తొక్కిపెట్టారన్నారు. నిబంధనలను గాలికి వదిలేయడం వల్లే అనర్హత కంపెనీలకు నెయ్యి సరఫరా చేసే అవకాశం లభించిందన్నారు. ఓ పద్దతి ప్రకారం చాలా స్పష్టంగా దేవునికి అపచారం చేశారన్నారు. 2022లోనే కల్తీ అని తేలినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని, కానీ వాళ్లు చర్యలు తీసుకోలేదన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక టీటీడీలో ప్రక్షాళన చేపట్టి, నెయ్యి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపామన్నారు. జులై 23, 2024లో ఎన్డీడీబీ రిపోర్టులో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారన్నారు. ఈ రిపోర్ట్ ఆధారంగానే తాను కల్తీ నెయ్యి విషయంపై మాట్లాడానన్నారు. కల్తీ జరిగిందని నివేదికలే చాలా స్పష్టంగా చెప్పాయని, టెండర్ నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేశారని తెలిపారు. నాటి టీటీడీ బోర్డ్ ఛైర్మన్ పీఏ చిన్న అప్పన్న లంచం తీసుకుని దొరికిపోయారని, నకిలీ రిపోర్టులతో టీటీడీకి మకిలీ అంటించారన్నారు. దొంగ రిపోర్టులతో అనుమతులు పొందారని, ఇవన్నీ నాటి టీటీడీ ఛైర్మన్, బోర్డుకు తెలిసే జరిగాయన్నారు .కల్తీ నెయ్యి తయారీకి ముఠాగా ఏర్పడ్డారన్నారు.
ఈ కుట్రకు పాల్పడిన నిందితులపై సిట్ వివిధ సెక్షన్ల కింద అభియోగాలు కూడా మోపిందన్నారు. తప్పు చేసిన వ్యక్తులు ఇప్పుడు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. నెయ్యి కల్తీని, అవినీతి వ్యవహారం సిట్ దర్యాప్తులో నిగ్గుతేలిందని, ఏఆర్ డైరీ నుంచి ఈ కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు వెల్లడైందని గుర్తుచేశారు. కుట్రపూరితంగా ఓ పద్ధతి ప్రకారం శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాన్ని చేస్తూనే వచ్చారని,కల్తీ నెయ్యి వ్యవహారం ఒకటైతే అన్యమత ప్రచార వ్యవహారం మరొకటి అన్నారు. తిరుమలకు తీసుకెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం చేశారని, జెరుసలేం యాత్ర అంటూ టికెట్లపై ముద్రించారన్నారు.పింక్ డైమండ్ చోరీ అని కూడా తనపై దుష్ప్రచారం చేశారన్నారు. పరకామణిలో చోరీ జరిగితే దానిని సెటిల్ చేసేందుకు ప్రయత్నం చేశారని, రాజీ ప్రయత్నాలుతో పాటు ఆ చోరీని సమర్థించేలా చులకనగా మాట్లాడారన్నారు. తిరుమలలో కూడా శ్రీవారిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వమంటే జగన్ సంతకం చేయలేదన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos