ఈవీఎంలపై నమ్మకం లేదని, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలను నిర్వహించాలని వైసీపీ అధినేత జగన్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... 2029 ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఎన్నికలను నిర్వహిస్తే పోటీ చేయబోనని తెలిపారు.
ఈవీఎంల ద్వారా ఎన్నికలను నిర్వహిస్తే... పోటీ చేసినా ఫలితం ఉండదని చెప్పారు. ఈ ఎన్నికల్లో మోసం జరిగినట్టుగానే 2029 ఎన్నికల్లో కూడా మోసం జరుగుతుందని అన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగితేనే స్వచ్ఛమైన ఫలితాలు వస్తాయని చెప్పారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో తీర్పు ఇచ్చింది ప్రజలు కాదని... ఈవీఎంలు తీర్పును వెలువరించాయని శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని కౌంటింగ్ పూర్తయిన అరగంటకే ప్రజలు చెప్పారని తెలిపారు.
ఈవీఎంలపై ఎంతో మంది అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ... ఎన్నికల సంఘం స్పందించడం లేదని విమర్శించారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. వచ్చే ఎన్నికలను కూడా ఈవీఎంల ద్వారా నిర్వహిస్తే... ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని, ఈవీఎంల ద్వారా అప్రజాస్వామిక విధానంలో నాయకులు ఎన్నికవుతుంటారని విమర్శించారు.
మరోవైపు... జమిలి ఎన్నికల అంశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027లో జమిలి ఎన్నికలు జరిగేట్టయితే, టీడీపీ ఇక రెండేళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని అన్నారు. ఈ లోపు టీడీపీ నేతలు చెప్పినట్టుగా అధికారులు నడుచుకోవద్దని, వారి మాటలు వినే అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
కొత్త మద్యం దుకాణాల్లో 90 శాతం టీడీపీ నేతలకే దక్కాయని కాకాణి అన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే లాటరీ ప్రక్రియ కొనసాగిందని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే షాపుల ఎంపిక జరిగిందని అన్నారు. ఎల్లో బ్యాచ్ బాగు కోసమే చంద్రబాబు మద్యం పాలసీని ప్రకటించారని విమర్శించారు. రాష్ట్రంలోని డిస్టిలరీలన్నీ టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే ఉన్నాయని... నాసిరకం మద్యాన్ని తక్కువ ధరకు అమ్ముతారని చెప్పారు.
రాష్ట్రంలో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా రానున్నాయని కాకాణి అన్నారు. రాబోయే రోజుల్లో లిక్కర్ ను డోర్ డెలివరీ కూడా చేస్తారని చెప్పారు. మద్యం దుకాణాల కేటాయింపుల్లో చంద్రబాబు మూడంచెల విధానాన్ని అమలు చేస్తారని అన్నారు. రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, గ్రామ స్థాయిలో బెల్ట్ షాపులతో కింది స్థాయి నాయకులు దోచుకుంటారని చెప్పారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos