తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆమెను దాదాపు రెండున్నర గంటలకు పైగా పోలీసులు విచారించారు. విచారణ ముగిసిన తర్వాత శ్యామల మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ లకు పాల్పడటం, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం తప్పేనని శ్యామల వ్యాఖ్యానించారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని శ్యామల తెలిపారు.
కేసు కోర్టు పరిధిలో ఉన్నందున విచారణ గురించి మాట్లాడటం సరికాదని.. బాధ్యత గల పౌరురాలిగా బెట్టింగ్ ను ఇకపై ప్రమోట్ చేయనని స్పష్టం చేశారు. ఇకపై అలాంటి పనులకు దూరంగా ఉంటానని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రాణాలు కోల్పోయిన వారి లోటును ఎవరూ భర్తీ చేయలేరని.. వారి కుటుంబాలకు తన ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నానని వాపోయారు. ఇప్పటికే టీవీ యాంకర్ విష్ణు ప్రియ, రీతూ చౌదరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. యూట్యూబర్లు హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ లకు సైతం విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయగా వారు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు. వీరి ఇరువురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్పై కేసు నమోదు చేశారు పోలీసులు. సన్నీయాదవ్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. లుక్ఔట్ సర్క్యూలర్ జారీ చేశారు. మరోవైపు శ్యామలను ట్రోల్ చేస్తూ కూటమి నేతలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలాఉండగా ఓ ఓటీటీ వేదికగా ప్రసారమైన షోలో ప్రభాస్, బాలకృష్ణ, గోపిచంద్ ముగ్గురు కలిసి 'Fun88' అనే చైనీస్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారని ఇమ్మనేని రామారావు అనే వ్యక్తి మారేడుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ యాప్ ద్వారా లక్షలాది మంది మోసపోయారని, ఈ ముగ్గురు హీరోలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ఫిర్యాదు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos