ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఓఎంసీ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. తాము ముందు పొరపాటున వేరే కేసుగా భావించి స్టే ఇచ్చామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అప్పుడు పొరపాటుగా ఇచ్చిన స్టేను నిందితులు ఎంజాయ్ చేశారని.. ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నామన్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగించాలని ఆదేశించింది.
ఓఎంసీ కేసులో క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని తొలగించి అక్రమాలు చేశారని సీబీఐ వాదనలు వినిపించింది. ఈ వ్యవహారంలో శ్రీలక్ష్మి కీలకంగా వ్యవహరించారని.. అలాగే ఆమె మరిది భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని కోర్టుకు తెలిపారు. సీబీఐ వాదనల తర్వాత సుప్రీం కోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి . గాలిజనార్ధన్రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి గనుల కేటాయింపు కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆమె జైలు జీవితాన్ని కూడా గడిపారు. ఆమె తెలంగాణ కేడర్లో కొనసాగి.. ఆ తర్వాత ఏపీ కేడర్కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఓఎంసీ కేసులో తన పేరును తొలగించాలని దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టేసింది.
2009లో గాలిజనార్ధన్ రెడ్డికి సంబంధించిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్పై అప్పటి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తితో కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించగా కేసు నమోదైంది. సీబీఐ 2011లో తొలి ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఈ కేసులో గాలి జనార్దన్రెడ్డితో పాటూ పీఏ మెఫజ్ అలీఖాన్, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్, కృపానందం, బీవీ శ్రీనివాసరెడ్డి పేర్లు చేర్చిన సంగతి తెలిసిందే. 2022లో తెలంగాణ హైకోర్టు ఓఎంసీ కేసులో ఏ6గా ఉన్న శ్రీలక్ష్మిని డిశ్చార్జి చేసింది. ఈ కేసు విచారణ సుదీర్ఘంగా సాగింది.. గత ఏడాది హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెల్లడించింది.
సీబీఐ కోర్టు ఈ ఓఎంసీ కేసులో గాలి జనార్దన్రెడ్డిని దోషిగా తేల్చింది.. ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. అలాగే దోషులుగా తేలిన ఏ3 వీడీ రాజగోపాల్ను, ఏ4 ఓఎంసీ కంపెనీ, ఏ7 మెఫజ్ అలీఖాన్ కు ఏడేళ్ల జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధించింది. వీరిలో వీడీ రాజగోపాల్కు నాలుగేళ్ల జైలుశిక్ష.. ఏ4 ఓఎంసీ కంపెనీకి రూ.లక్ష, రూ.లక్ష చొప్పున రూ.2 లక్షల జరిమానా విధించింది సీబీఐ కోర్టు. అయితే ఓఎంసీ కేసులో సబితా ఇంద్రారెడ్డిని, విశ్రాంత ఐఏఎస్ కృపానందంను నిర్దోషిగా తేల్చింది కోర్టు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos