ఏపీలో అధికార యంత్రాంగం నిర్వీర్యంగా మారి అక్రమాలు నిరోధించడంలోనూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలోనూ విఫలమవుతోందని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంటే కలెక్టర్లు నిస్సహాయులై చూస్తున్నారని, మీరే నిస్సహాయులైతే ప్రజలకు ఇంకెవరు దిక్కని వారిని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్నీ కల్తీ అయిపోతున్నాయని, స్వయంగా మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి బియ్యం నిల్వలు సీజ్ చేసినా ఫలితం లేదన్నారు.
ఇసుకను స్ట్రీమ్ లైన్ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అయినా ఇసుక వ్యవహారంలో ఎమ్మెల్యేల జోక్యం ఆగడం లేదని, ఇకపై ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యేలను పవన్ హెచ్చరించారు. ప్రజలకు మంచి చేసేందుకే ఇక్కడ ఉన్నామని, మీకు అవసరమైన మద్దతిస్తామని కలెక్టర్లకు తెలుపుతూ.. మిమ్మల్ని ఏది ఆపుతోందని కలెక్టర్లను పవన్ ప్రశ్నించారు. తాము మాత్రం చిత్తశుద్దిగా ఉన్నామన్నారు.
స్మగ్లింగ్పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఆఖరికి పెట్రోల్లో కూడా కల్తీ పెరిగిపోతోందని, స్వయానా మంత్రి నాదెండ్ర మనోహర్ వెళ్లి సీజ్ చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఇలాంటి కల్తీలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐదేళ్ళ వైసీపీ పాలనలో రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులు పాలైందని, అధికారులకు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్ షిప్లో ఏపీలో సుస్థిర పాలనను అందిచేందుకు అంతా సహకారం అందించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఏదైనా సాధించగలరని.. గతంలో తాను ప్రభుత్వం బయట ఉన్నప్పుడు అనుకునేవాడినని, కానీ పరిస్దితి అలా లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. వ్యవస్ధల్ని మీరు బలోపేతం చేయాలి కానీ, ఇలా నిస్సహాయతతో చూస్తుంటే సగటు మనిషి ఎక్కడికెళ్తాడని, క్షేత్రస్దాయిలో పరిస్దితులు కాస్త అటు ఇటుగా ఉండొచ్చు కానీ మీరు మాత్రం నిబంధనల మేరకు వ్యవహరించాల్సిందేనని పవన్ కలెక్టర్లకు సూచించారు. కలెక్టర్ల సమావేశంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos