ఏపీ శాసనమండలిలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజుపైకి దూసుకెళ్లారు. వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ సహా ఇతర వైసీపీ సభ్యులు ఆయన మీదికి దూసుకెళ్లడంతో మండలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం పూర్తయినా.. తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలపై చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టుపట్టారు. కానీ సమాధానం పూర్తి కావడంతో ఛైర్మన్ మోషేను రాజు మరో ప్రశ్నకు అవకాశం కల్పించడంతో సోము వీర్రాజు తర్వాతి ప్రశ్న లేవనెత్తారు. ఈ క్రమంలో ఛైర్మన్ తీరుకు నిరసనగా వైసీపీ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీదకు దూసుకెళ్లారు. ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ ఆయనపై నోరు పారేసుకున్నారు. నిరసన వ్యక్తం చేస్తుంటే మైక్ ఎందుకు తీసుకున్నావంటూ వీర్రాజుపై దాడికి యత్నించారు. ఇజ్రాయిల్ కు మద్దతుగా వైసీపీ సభ్యులు, సోము వీర్రాజుకు మద్దతుగా మంత్రులు అనిత, గొట్టిపాటి రవికుమార్ లు వెళ్లడంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సభ పలుమార్లు వాయిదా పడింది.

అంతకుముందు అదే అంశంపై మాట్లాడిన బొత్స సత్యనారాయణ.. రాష్ట్ర ప్రజల కోసం తాము ఏ ప్రశ్నైనా వేస్తామని అందుకు కూటమి నేతలు సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. వాళ్లకు కావలసిన ప్రశ్నలే తామెందుకు అడుగుతామన్నారు. రాయలసీమ లిఫ్ట్ విషయంలో పక్క రాష్ట్ర సీఎం రేవంత్ చెప్పింది నిజమా కాదా అన్నదానిపైనే తాము ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై సూటిగా సమాధానం చెప్పాలని, రేవంత్ ప్రకటనపై సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 

బొత్స వ్యాఖ్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైరయ్యారు. మండలిలో గంటసేపు ప్రశ్నోత్తరాలు జరపాలని తొలిరోజే అనుకున్నామని గుర్తుచేశారు. ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, ప్రశ్న వేసే ముందు ప్రతిపక్ష సభ్యులు ఆలోచించుకోవాలని సూచించారు. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉందని సమాధానం చెప్పాలా? అని నిలదీశారు. వైసీపీ సభ్యులు వాకౌట్ చేయకుండా ఉంటే, వింటే తాము ఏ చర్చకైనా సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం జీఓ 365 తెచ్చి 102 సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసిందని, గోరుకల్లు, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించిందని మంత్రులు ఆరోపించారు. "మీ దరిద్రపు పాలనలో, మీ అసమర్థ నాయకుడి చేతకానితనం వల్లే రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయింది. ఆ నిజాన్ని కప్పిపుచ్చి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు ఒక యజ్ఞంలా పనిచేస్తుంటే, వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు" అని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ హయాంలో నిలిచిపోయిన పనులకు మమ్మల్ని బాధ్యులను చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని వారు హితవు పలికారు.

Related Videos