ఏపీ కేంద్రంగా రాజకీయ లెక్కలు మారుతున్నాయి. కూటమి - వైసీపీ మధ్య కొత్త రాజకీయ వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. లడ్డూ వ్యవహారం రాజకీయ వివాదంగా మారుతోంది. ఇదే సమయంలో ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యూత్ కాంగ్రెస్ నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తున్నాయి. ఇదే అంశం పైన మాజీ సీఎం జగన్ స్పందించారు. ఈ మేరకు జగన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కొత్త సమీకరణాల దిశగా విశ్లేషణలు మొదలయ్యాయి.
ఢిల్లీలో కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ ఇంపాక్ట్ సమిట్ వేదిక వద్దకు దూసుకొచ్చిన యువజన కాంగ్రెస్ కార్యకర్తల బృందం చొక్కాలు విప్పి నిరసన తెలిపింది. మోదీ, ట్రంప్ చిత్రాలు ఉన్న టీ షర్టులతో.. అర్ధనగ్నంగా హాల్ నెంబర్ 5లోకి ప్రవేశించిన కార్యకర్తలు ప్రధాని మోదీ కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమిట్ లో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో.. చేసిన ఈ నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగాయి. ఢిల్లీతో పాటుగా హైదరాబాద్, గుంటూరు లోనూ బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయాల వద్ద ఆందోళన కు ప్రయత్నించాయి. కాగా, ఇప్పుడు ఇదే అంశం పైన మాజీ సీఎం జగన్ స్పందిస్తూ .. యూత్ కాంగ్రెస్ పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ మేరకు జగన్ ట్వీట్ చేసారు.
యూత్ కాంగ్రెస్ ఏఐ సమ్మిట్ లో చేసిన నిర్వాకం మనందరినీ సిగ్గుపడేలా చేసిందని జగన్ ఘాటుగా స్పందించారు. రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. ఎవరూ మన దేశాన్ని ఎప్పుడూ కించ పరిచే విధంగా వ్యవహరించకూడదని జగన్ సూచించారు. రాజకీయంగా ఎలాంటి విభేదాలు ఉన్నా.. దేశం అంతా ఐక్యంగా ఉంటామనే సంకేతాలు ప్రపంచానికి ఇవ్వాలని పేర్కొన్నారు. కాగా వైఎస్సార్ మరణం తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్ సొంత పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ తో ఎలాంటి సంబంధాలు కొనసాగించటం లేదు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఎన్డీఏకు అవసరమైన సమయంలో మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. అటు యూత్ కాంగ్రెస్ నిరసన పైన బీజేపీ నేతలు ఆగ్రహం తో ఉన్న సమయంలో జగన్ చేసిన తాజా ట్వీట్ రాజకీయంగా కొత్త చర్చకు కారణంగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos