మూడు రాజధానుల నినాదాన్ని మోత మోగించి.. మూడుచోట్లా బొక్కా బొర్లా పడింది వైసీపీ. అది ఎంత దెబ్బతీసిందో ఎలక్షన్ తర్వాతనే అర్థం అయింది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన రాజధానిని నాశనం చేసి.. మూడు ముక్కలాట ఆడారన్న భావన ప్రజల్లో తీవ్రంగా వ్యాపించింది. వైఎస్సార్సీపీ మూడు రాజధానుల నినాదంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎన్నికల తర్వాత దానిపై పెద్దగా స్పందించని ఆ పార్టీ నిన్న పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది. మూడు రాజధానులు మా అజెండాలో లేదన్నట్లుగా ఆ పార్టీ అధినేత జగన్ మోహనరెడ్డే స్వయంగా మాట్లాడారు. ఆయన నేరుగా ఆ విషయం చెప్పకపోయినా .. రాజధాని విషయంలో వైకాపా అధినేత మాటల మర్మం అదే అని అర్థం అవుతోంది.
పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘంగా నిన్న మీడియాతో మాట్లాడిన జగన్మోహనరెడ్డి రాజధాని విషయంలో యూ టర్న్ తీసుకున్నారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉండాలన్న తమ పార్టీ విధానానికి విరుద్ధంగా ఓ చోట 500 ఎకరాల్లో రాజధాని కట్టుకోమన్నారు. నిన్న అమరావతిపై వ్యాఖ్యలు చేసిన జగన్ మోహనరెడ్డి గుంటూరు- బెజవాడ మధ్యలో రాజధాని కట్టుకోమన్నారు. అంటే విజయవాడ ప్రాంతాన్ని ఆయన అంగీకరించినట్లేనని.. నేరుగా అమరావతిని యాక్సెప్ట్ చేయకపోయినా.. అమరావతి సమీపంలో రాజధాని ఓకే అన్నట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్... అమరావతి పనులున్నీ అర్థాంతరంగా అపడంతో పాటు.. రాజధానిపై నెగటివ్ ప్రచారం కూడా చేశారు. ఆ ప్రభుత్వంలోని ఒక మంత్రి అమరావతిని ఏకంగా స్మశానమని అన్నారు. ఆ తర్వాత నుంచి ఒక్కొక్కరుగా వ్యతిరేకించారు. అసలు అమరావతే వద్దంటూ అక్కడ దీక్షలు చేయించారు. అమరావతి రైతుల దీక్షను అణచివేశారు. మూడు రాజధానులతో మేలు చేస్తామని చెప్పారు. కానీ ఈ పనిలో వైఎస్సార్సీపీ సక్సెస్ కాలేకపోయింది. మూడు రాజధానులపై జనాల్లో సానుకూలత రాలేదు. వైజాగ్ లో రాజధాని పెడతామని చెప్పినా కూడా అక్కడి వారు ఎన్నికల ముందు పాజిటివ్గా రియాక్ట్ కాలేదు. అయినా సరే ఈ విషయంలో అప్పటి ప్రభుత్వం మొండిగానే వ్యవహరించింది. చివరకు... మాజీ సీఎం జగన్ కు అమరావతిని అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos